New National Highways | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా ఢిల్లీలోనే మాకాం వేసి వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్న సంగతి తెలిసిందే.. రాష్ట్రంలోని వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రతిపాదనల గురించి ఆయా శాఖల మంత్రులతో సీఎం చర్చిస్తున్నారు. ఈమేరకు బుధవారం కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. ఈసందర్భంగా తెలంగాణలో యుద్ధప్రాతిపదికన జాతీయ, రాష్ట్ర రహదారుల విస్తరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రికి ముందుంచారు.
రీజినల్ రింగు రోడ్డు ( RRR) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి నుంచి నర్సాపూర్-తూప్రాన్-గజ్వేల్-జగదేవ్పూర్-భువనగిరి-చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని కోరారు. దీనికి సంబంధించి భూ సేకరణకు అయ్యే వ్యయంలో సగ భాగాన్ని తమ ప్రభుత్వమే భరిస్తోందని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ భాగంలో తమ వంతు పనులను వేగవంతం చేశామన్నారు. చౌటుప్పల్ నుంచి అమన్గల్-షాద్నగర్-సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కోరారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి, ఈ ఏడాది ఎన్హెచ్ఏఐ వార్షిక ప్రణాళికలో నిధులు మంజూరు చేయాలన్నారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ-తొర్రూరు-నెల్లికుదురు-మహబూబాబాద్-ఇల్లెందు- కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్హెచ్-930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని కోరారు. ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.లకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్ర మంత్రి గడ్కరీ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. హైదరాబాద్ వాసులు భద్రాచలం వెళ్లేందుకు 40 కి.మీ. దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్ రోడ్డుగా వరంగల్ సభలో నితిన్ గడ్కరీ చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ రహదారిలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచామని, వెంటనే పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఆరు లైన్లుగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి
రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా హైదరాబాద్-విజయవాడ (ఎన్హెచ్ 65) జాతీయ రహదారిని 2024, ఏప్రిల్లోగా ఆరు లైన్ల రహదారిగా విస్తరించాలని రేవంత్ రెడ్డి కోరారు. ఈ రహదారిలో ప్రతిరోజు 60 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని, విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ.. వాహన రద్దీ తగ్గిందని, తమకు సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు లైన్ల పనులు చేపట్టడం లేదని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలిపారు. వెంటనే ఎన్హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించాలని, త్వరగా రహదారి విస్తరణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ఎలివేటెడ్ కారిడార్
New National Highways : కల్వకుర్తి నుంచి కొల్లాపూర్-సోమశిల-కరివెన-నంద్యాల (ఎన్హెచ్-167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ. పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని కేంద్ర మంత్రి గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి కోరారు. మిగిలిన 32 కి.మీ.పనులకు, ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ ప్రజలకు తిరుమల తిరుపతి దేవస్థానానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని చెప్పారు.
ఇక కల్వకుర్తి-నంద్యాల రహదారి (ఎన్హెచ్ -167కే) హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్హెచ్ 765కే) 67 కిలోమీటర్ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్హెచ్ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్- కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్హెచ్ 765కే) రహదారిని రెండు వరుసల నుంచి నాలుగు వరుసలుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి – కరివెన వరకు జాతీయ రహదారి పూర్త అయ్యే లోపు హైదరాబాద్ – కల్వకుర్తి రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరణకు అనుమతులివ్వాలని విజ్ఞప్తి చేశారు.
New National Highways : కీలక రహదారుల జాబితా ఇదే..
- తెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రను అనుసంధానించే హైదరాబాద్-మన్నెగూడ నాలుగు లైన్ల జాతీయ రహదారి (ఎన్హెచ్-163) పనులు వెంటనే ప్రారంభించాలి.
- సేతు బంధన్ పథకం కింద 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్యూబీలను వెంటనే మంజూరు చేయాలి.
- జగిత్యాల-కాటారం (130 కి.మీ.),
- దిండి-నల్గొండ (100 కి.మీ.),
- భువనగిరి-చిట్యాల (44 కి.మీ),
- చౌటుప్పల్-సంగారెడ్డి (182 కి.మీ),
- మరికల్-రామసముద్రం (63 కి.మీ.),
- వనపర్తి-మంత్రాలయం (110 కి.మీ.),
- మన్నెగూడ-బీదర్ (134 కి.మీ.),
- కరీంనగర్-పిట్లం (165 కి.మీ.),
- ఎర్రవెల్లి క్రాస్ రోడ్-రాయచూర్ (67 కి.మీ.),
- కొత్తపల్లి-దుద్దెడ (75 కి.మీ.),
- సారపాక-ఏటూరు నాగారం (93 కి.మీ.),
- దుద్దెడ-రాయగిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.),
- జగ్గయ్యపేట-కొత్తగూడెం (100 కి.మీ.),
- సిరిసిల్ల-కోరట్ల (65 కి.మీ.),
- భూత్పూర్-సిరిగిరిపాడు (166 కి.మీ.),
- కరీంనగర్-రాయపట్నం (60 కి.మీ.)
మొత్తం 1617 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను అప్గ్రేడ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిని కోరారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి.