జపాన్ రెంకోజీ ఆలయం నుంచి భారత్కు నేతాజీ అస్తికలు తేవాలని దేశవ్యాప్త ఉద్యమం
“నాకు రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను” అంటూ బ్రిటీష్ సామ్రాజ్య పునాదులను కదిలించిన అపర విప్లవ వీరుడు, గ్లోబల్ లీడర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయాల సాధనకు దేశంలో ఒక సరికొత్త జాతీయ విప్లవం ఊపిరి పోసుకుంది. నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజ్ (ఐఎన్ఏ) వీరుల అసమాన త్యాగాలు, దేశభక్తి స్ఫూర్తితో ఏర్పాటైన దేశభక్తి జాతీయ వేదిక ‘ఆజాద్ బోస్ ఫౌజ్’ (AZAD BOSE FOUZ) ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. జపాన్లోని రెంకోజీ ఆలయంలో దశాబ్దాలుగా ఉన్న నేతాజీ అస్తికలను తిరిగి మాతృభూమికి తీసుకురావడమే ఏకైక లక్ష్యం (Bring Back Bose Bones Campaign)గా ఈ సంస్థ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారీ బైక్ యాత్ర (Kanyakumari to Kashmir Bike Yatra) ను ప్రారంభించింది.
ఒక పవిత్రమైన మిషన్!
భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం ధారపోసిన నేతాజీ లాంటి మహనీయులకు చరిత్రలో జరగాల్సిన అసలైన న్యాయం, గుర్తింపు ఇంకా లభించలేదనేది ‘ఆజాద్ బోస్ ఫౌజ్’ ప్రధాన వాదన. ఇది కేవలం ఒక వెబ్సైట్ లేదా స్వచ్ఛంద సంస్థ కాదు; ఇదొక జాతీయ మేల్కొలుపు, చారిత్రక అన్యాయాలపై శాంతియుత సమరం. నేతాజీ అస్తికలను భారత్కు తీసుకురావాలనే మీ ఆకాంక్షను ‘ఆజాద్ బోస్ ఫౌజ్ వెబ్సైట్ ద్వారా తెలపవచ్చు.
ఆజాద్ బోస్ ఫౌజ్ లక్ష్యం :
- చారిత్రక నిర్లక్ష్యం నుంచి విముక్తి
- జాతీయ అస్మితపై జరుగుతున్న కుట్రల నుంచి విముక్తి
- మహనీయులను మరువకుండా నిరంతరం స్మరించుకోవడం.. ఈ వేదిక యొక్క ముఖ్య ఉద్దేశాలు.
- నేతాజీ సుభాష్ చంద్రబోస్కు పూర్తి జాతీయ గౌరవం కల్పించాలి
- జపాన్లోని అస్తికలను భారత్కు తీసుకురావాలి
- ఆజాద్ హింద్ ఫౌజ్ పాత్రపై విస్తృత అవగాహన కల్పించాలి
- నేతాజీ చరిత్రకు సంబంధించిన పూర్తి పారదర్శకత తీసుకురావాలి
- జాతీయ నాయకులపై తప్పుడు ప్రచారాలను అరికట్టాలి
కుమార్తె అనితా ఫాఫ్ హృదయ విదారక విజ్ఞప్తి: ‘నా తండ్రి చివరి కోరిక తీర్చండి’
నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏకైక కుమార్తె, 79 సంవత్సరాల వృద్ధురాలు అనితా ఫాఫ్ (Anita Pfaff) దేశ ప్రజలకు చేసిన ఒక హృదయ విదారక విజ్ఞప్తి ఈ ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారింది.
“నా తండ్రి అస్తికలకు ఆయన సొంత మాతృభూమి (భారతదేశం)లో అంతిమ సంస్కారాలు, పవిత్ర క్రతువులు నిర్వహించడం ఆయన చివరి కోరిక. ఒక కుమార్తెగా అది నా హక్కు. అవసరమైతే ఆ అస్తికలపై డీఎన్ఏ (DNA) పరీక్షలు కూడా జరపండి. జపాన్ ప్రభుత్వం ఆ అస్తికలను అత్యంత భద్రంగా కాపాడుతున్నందుకు ధన్యవాదాలు. కానీ, నా వయస్సు ఇప్పుడు 79 ఏళ్లు.. నా తండ్రికి మాతృభూమి మట్టిలో గౌరవం దక్కేలా భారతీయులంతా నాకు మద్దతుగా నిలవాలి” అని ఆమె అప్పీల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమెతోపాటు కోట్లాది మంది నేతాజీ అభిమానుల నుంచి ‘బ్రింగ్ బ్యాక్ బోస్ బోన్స్’ (BRING BACK BOSE BONES) అనే నినాదంతో ఆజాద్ బోస్ ఫౌజ్ లక్షలాది మంది గొంతుకగా మారింది.
కన్యాకుమారి టు కశ్మీర్: సరిహద్దులు దాటుతున్న దేశభక్తి బైక్ యాత్ర
ఈ పవిత్ర ఆశయాన్ని భారతీయుల గుండెల్లోకి తీసుకెళ్లేందుకు ఆజాద్ బోస్ ఫౌజ్ ప్రతినిధులు భారతదేశ దక్షిణ కోన కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న కశ్మీర్ సరిహద్దుల వరకు ‘మహా బైక్ యాత్ర’ను చేపట్టారు. ఈ యాత్ర వెళ్తున్న ప్రతి నగరంలోనూ, గ్రామంలోనూ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువత దేశభక్తి నినాదాలతో నేతాజీ స్ఫూర్తిని చాటుతున్నారు. మతం, ప్రాంతం, భాష, రాజకీయాలకు అతీతంగా కేవలం ‘జాతీయవాదం’ అనే ఒకే తాటిపై దేశ ప్రజలను ఏకం చేస్తూ ఈ బైక్ రైడర్స్ ముందుకు సాగుతున్నారు.
కోట్లాది గొంతుకల ‘సంతకాల సేకరణ ఉద్యమం’
బైక్ యాత్రతో పాటు సమాంతరంగా దేశవ్యాప్తంగా బృహత్తర సంతకాల సేకరణ (Nationwide Signature Campaign) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది, రాబోయే రోజుల్లో లక్షలాది మంది దేశభక్తులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. “ఇందులో పెట్టే ప్రతి సంతకం కేవలం సిరా చుక్క కాదు.. అది ఒక దేశభక్తుడి గొంతుక, నేతాజీకి ఇచ్చే నిజమైన నివాళి, దేశ గౌరవ రక్షణకై చేసే పవిత్ర ప్రతిజ్ఞ” అని సంస్థ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳










