Ration Card Application | ఎన్నో ఏళ్లుగా కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాలపై సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర సచివాలయంలో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ అధికారులకు పలు సూచనలు చేశారు. రేషన్ కార్డులు మంజూరుకు పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూతన రేషన్ కార్డుల కోసం అక్టోబరు 2వ తేదీ నుంచి దరఖాస్తుల (Ration Card Application ) ను స్వీకరించాలని సీఎం సూచించారు.
అర్హులందరికీ డిజిటల్ రేషన్ కార్డులు ఇచ్చే అంశంపై చర్చించారు. ఈ అంశంపై త్వరలోనే మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈసారి ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులను వేర్వేరుగా మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం త్వరలోనే సర్వే నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్ రెడ్డి, సంగీత సత్యనారాయణ, మాణిక్ రాజ్, రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం.రఘునందన్రావు, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డి.ఎస్.చౌహాన్ ఇతర ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..