
Runa Mafi | రూ.2 లక్షలకుపైగా ఉన్న రైతు రుణాల మాఫీకి త్వరలోనే కటాఫ్ డేట్ ను వెల్లడిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్న అర్హులైన రైతులు ముందుగా ఆపై ఉన్న రుణాన్ని చెల్లించిన తర్వాతే మాఫీ చేస్తామని ప్రభుత్వం ముందే ప్రకటించిందని గుర్తుచేశారు. గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీకి రేషన్కార్డు ప్రామాణికం కాదని, తెల్ల రేషన్కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తున్నామనేదానిలో వాస్తవం లేదని స్పష్టంచేశారు.
ఇప్పటివరకు రూ.18 వేల కోట్ల రుణాలను మాఫీ (Runa Mafi) చేసినట్లు మంత్రి పొంగులేటి చెప్పారు. రూ.12 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉన్నదని రూ.2 లక్షలకు పైబడిన రుణమాఫీకి నెల, లేదా రెండు నెలల్లో కటాఫ్ తేదీ పెట్టి, రైతులు ఎక్కువ ఉన్న రుణాన్ని చెల్లించగానే రైతుల ఖాతాలో రూ.2 లక్షలు జమ చేస్తామని తెలిపారు. ఈ నిబంధనపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. రైతులకు రుణమాఫీ తర్వాత మళ్లీ లోన్ రావాలంటే పూర్తిగా రుణం మాఫీ కావాల్సిన ఉంటుందని చెప్పారు. అందుకే రూ.2 లక్షలకుపైగా ఉన్న రుణం రైతులు పూర్తిగా చెల్లిస్తే వారికి మొత్తం మాఫీ అయిపోయి, తర్వాత మళ్లీ రుణం మంజూరవుతుందని తెలిపారు. కొన్ని సాంకేతిక కారణాలతో రూ.2 లక్షల వరకు అప్పులు ఉన్న కొందరు రైతులకు మాఫీ కాలేదని, వారికి కూడా పూర్తిస్థాయిలో రుణ విముక్తులను చేస్తామని చెప్పారు.
రేషన్కార్డులు, హెల్త్కార్డులు
తెల్ల రేషన్కార్డులకు మంజురు కోసం మంత్రులతో సబ్కమిటీ వేశామని, త్వరలోనే రేషన్ కార్డులను జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ప్రజల అభిప్రాయం మేరకు తెల్ల రేషన్కార్డులను, ఆరోగ్యశ్రీ కార్డులను వేర్వేరుగా అందజేస్తామని తెలిపారు. ఇక కొత్త రెవెన్యూ చట్టాన్ని దేశానికి ఆదర్శంగా తీసుకొస్తున్నట్టు తెలిపారు. ప్రజలు, మేధావుల నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకు ఈ నెల 23, 24, 25 తేదీల్లో రెవెన్యూ యాక్ట్పై కలెక్టరేట్లలో సదస్సులు నిర్వహిస్తున్నట్టు వివరించారు.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.