ఫార్మా రవాణాలో భారతీయ రైల్వే విప్లవం: కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి
హైదరాబాద్: భారతదేశ ‘ఫార్మా హబ్’గా పేరొందిన హైదరాబాద్ నగరం నుంచి ముంబైకి ఔషధాలను వేగంగా, సురక్షితంగా చేరవేసేందుకు భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకమైన ‘ఔషధి ఎక్స్ప్రెస్ (Oshadhi Express)’ సేవలను ప్రారంభించింది. పీఎం గతిశక్తి కార్యక్రమంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన ఈ ప్రత్యేక రీఫర్ (కోల్డ్ స్టోరేజ్) రైలు పట్ల కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
హైదరాబాద్ ఫార్మా కంపెనీలకు వరం
హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ, జీడిమెట్ల, పటాన్చెరు మరియు ముచ్చర్ల వంటి ప్రాంతాల్లో తయారయ్యే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ (జీవరక్షక మందులు) నాణ్యత తగ్గకుండా అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయడంలో ఈ రైలు కీలకం కానుంది. సనత్ నగర్ లోని ఇన్ ల్యాండ్ కంటైనర్ డిపో (ICD) నుండి ముంబై సమీపంలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ (JNPT) వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది.
అత్యాధునిక రీఫర్ టెక్నాలజీ
మందులు పాడవకుండా ఉండేందుకు ఈ రైలులో డీజిల్ పవర్ ప్యాక్లతో కూడిన అధునాతన రీఫర్ కంటైనర్లను వినియోగిస్తున్నారు. ప్రయాణ సమయంలో అంతటా కంటిన్యూయస్ రిఫ్రిజిరేషన్ సౌకర్యం ఉండటం వల్ల మందుల నాణ్యత దెబ్బతినదు.
Oshadhi Express ముఖ్య విశేషాలు:
- తక్కువ ఖర్చు: రహదారి రవాణాతో పోలిస్తే తక్కువ వ్యయం, తక్కువ సమయంలో ఔషధాల సరఫరా.
- వారానికి రెండుసార్లు: ప్రస్తుతం వారానికి ఒకసారి నడుస్తున్న ఈ రైలును, డిమాండ్ను బట్టి వారానికి రెండుసార్లు నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.
- పర్యావరణ అనుకూలం: పీఎం గతిశక్తి లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిరమైన రవాణా వ్యవస్థకు ప్రాధాన్యత.
తెలంగాణకు ఈ ప్రతిష్టాత్మక రైలును కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని ఇన్నోవేషన్ బేస్డ్ సొల్యూషన్స్తో రవాణా రంగాన్ని ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳










