Election Results 2023 : రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించి విజయకేతనం ఎగురవేసింది. మూడు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. ఇందులో అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్గఢ్లను హస్తం పార్టీ కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో ఆయా రాష్ర్టాల్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘనంగా సంబరాలు చేసుకొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మానుష్యంగా వెలవెలబోయి కనిపించాయి.
మధ్యప్రదేశ్లో బీజేపీ ఐదోసారి..
Election Results 2023 : మధ్యప్రదేశ్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. 230 సీట్ల అసెంబ్లీలో 163 సీట్లను కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విజయానికి డబుల్ ఇంజన్ ప్రభుత్వమే కారణమన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ 66 స్థానాలను గెలుచుకుంది. భారత్ ఆదివాసీ పార్టీ తన తొలి విజయాన్ని రుచి చూసింది.
ఫలితాలను బట్టి చూస్తే బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంతగా లేదని తెలుస్తోంది. కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న 2018 నుండి 15 నెలల కాలంతో తప్ప మిగతా రెండు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం.. మహిళల్లో ప్రజాదరణ పొందిన చౌహాన్ పథకాలను క్యాష్ చేసుకున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గ్రౌండ్ లెవెల్లో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లారని విశ్లేషకులు భావిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కు బీజేపీ షాక్
భూపేష్ బఘేల్ నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీ విజయాన్ని అందుకుంది. 90 సీట్లకు గాను బీజేపీ 54 సీట్లు గెలుచుకోవడం ద్వారా సగం మార్కును దాటింది. కాంగ్రెస్ 35, ఇతరులు స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2018లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఘనవిజయానికి దోహదపడిన 26 అసెంబ్లీ స్థానాలను కలిగి ఉన్న సుర్గుజా, బస్తర్లోని రెండు గిరిజన ప్రభావిత ప్రాంతాలు ఈసారి భారతీయ జనతా పార్టీకి జైకొట్టాయి. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్కు మరో సారి పట్టం కడతారని చేసిన అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి.
2018 ఛత్తీస్గఢ్ ఎన్నికలలో మొత్తం 70 నియోజకవర్గాలకు గాను కాంగ్రెస్ 51 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ కేవలం 13 స్థానాలు మాత్రమే గెలుచుకోగలిగింది. జనతా కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ (జె) నాలుగు స్థానాలను, బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పి) రెండు స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ మరో స్థానాన్ని గెలుచుకుంది.
90 మంది సభ్యుల ఛత్తీస్గఢ్ అసెంబ్లీకి నవంబర్ 7 మరియు 17 తేదీల్లో రెండు భాగాలుగా ఓటింగ్ జరిగింది. నవంబర్ 17న 70 నియోజకవర్గాలకు జరిగిన రెండో విడత ఎన్నికల్లో 68.15 శాతం ఓటింగ్ నమోదైంది , 20 స్థానాలకు రెండో దశ ఎన్నికలు జరిగాయి. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రంలో అత్యధికంగా 78 శాతం ఓటింగ్ నమోదైంది.
రాజస్థాన్లో కొనసాగిన ఆనవాయితీ..
రాజస్తాన్(Rajastan) విషయానికొస్తే ఇక్కడ గడిచిన 30 ఏళ్లుగా తమిళనాడు తరహాలో ఒకేవిధమైన ప్రజలు తీర్పు ఇచ్చారు. అంటే ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. మరో ఐదు సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఐదేళ్లకంటే ఎక్కువ ఏ పార్టీ అధికారంలో కొనసాగడం లేదు. 2018లో కాంగ్రెస్ అధికారంలోకి రాగా అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2023 ఎన్నికల్లో ప్రజలు బీజేపీ(BJP)కే పట్టం కట్టారు. కమలం పార్టీ 115 స్థానాలను విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ 69 సీట్లకే పరిమితం కాగా, ఇతరులు 15 స్థానాలను గెలుచుకున్నారు.
ఏది ఏమైనా ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో సంపూర్ణ విజయాన్ని సాధించి తన ఆధిపత్యాన్ని నిలుపుకోగలిగింది. దీని ప్రభావం రానున్న లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..