Friday, April 24, 2026
Trending News

ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ: బీజేపీలో చేరిన రాఘవ్ చద్ధా.. – Raghav Chadha Joins BJP

Spread the love

Raghav Chadha Joins BJP | దేశ రాజధాని రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కేవలం ఆయనొక్కరే కాకుండా, రాజ్యసభలోని ‘ఆప్’ ఎంపీలలో మూడింట రెండు వంతుల (2/3) మందిని తనతో పాటు బీజేపీలోకి తీసుకువెళ్లి, ఆ బృందాన్ని బీజేపీలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీకి గొడ్డలి పెట్టు వంటి పరిణామంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

“నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని” : Raghav Chadha

శుక్రవారం మధ్యాహ్నం న్యూఢిల్లీలో మరో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్ లతో కలిసి రాఘవ్ చద్ధా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆప్ అధిష్టానంపై ఘాటు విమర్శలు చేశారు. “నా రక్తం, చెమట ధారపోసి, నా యవ్వనంలోని 15 ఏళ్లను అంకితం చేసి పెంచి పోషించిన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు తన సూత్రాలు, నైతిక విలువల నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుంది. ఆ పార్టీ ఇకపై దేశ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం వ్యక్తిగత లాభం కోసమే పనిచేస్తోంది. నేను తప్పుడు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అని నాకు అర్థమైంది” అని రాఘవ్​ చద్దా ఆవేదన వ్యక్తం చేశారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం విలీనం

రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న మొత్తం సభ్యుల్లో మూడింట రెండు వంతుల మంది కలిసి నిర్ణయం తీసుకోవడం ద్వారా, భారత రాజ్యాంగంలోని ఫిరాయింపుల నిరోధక చట్టం నిబంధనల ప్రకారం తాము బీజేపీలో విలీనమవుతున్నామని రాఘవ్​ స్పష్టం చేశారు. దీనివల్ల వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉండదు.

బీజేపీలోకి వెళ్తున్న ప్రముఖులు వీరే..

రాఘవ్ చద్ధాతో పాటు బీజేపీలో చేరిన లేదా విలీన ప్రక్రియలో భాగమైన ప్రముఖ నాయకులలో:

  • సందీప్ పాఠక్ (ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శి)
  • అశోక్ మిట్టల్
  • స్వాతి మలివాల్
  • హర్భజన్ సింగ్ (మాజీ క్రికెటర్)
  • రాజిందర్ గుప్తా
  • విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ

నేపథ్యం: గత కొన్ని వారాలుగా ఆమ్ ఆద్మీ పార్టీలో రాఘవ్ చద్ధా ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. ఇటీవలే ఆయనను రాజ్యసభలో పార్టీ డిప్యూటీ లీడర్ పదవి నుండి తొలగించిన సంగతి తెలిసిందే. అప్పటి నుండే ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు ఈ రోజు ఆ వార్తలను నిజం చేస్తూ ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ పరిణామం ఢిల్లీ మరియు పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా, జాతీయ స్థాయిలో కూడా ‘ఆప్’ ఉనికిని ప్రశ్నార్థకం చేస్తోంది. మరోవైపు, రాజ్యసభలో బీజేపీ బలం గణనీయంగా పెరగనుంది.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *