Tiranga Yatra | తిరంగా యాత్రను విజయవతం చేయండి

కేంద్రమంత్రి కిషన్రెడ్డి పిలుపు
Tiranga Yatra in Hyderbad : పహల్గామ్ (Pahalgam) దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైన నేపథ్యంలో మన వీరజవాన్లకు మద్దతు తెలుపుతూ శనివారం ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించే తిరంగా యాత్ర (Tiranga Yatra )ను విజయవంతం చేయాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister G.Kishan Reddy) పిలుపునిచ్చారు. శుక్రవారం బిజెపి(BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతకు సవాలుగా నిలిచిన పహల్గామ్ ఘటనకు కారణమైన వారిని భారతదేశం వదిలిపెట్టేది లేదని, ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని భారత ప్రధాని గట్టి హెచ్చరిక చేశారని గుర్తుచేశారు. మే 6 రాత్రి ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైనికులు అత్యంత చాకచక్యంగా, సమర్థవంతంగా, ప్రపంచం ప్రశంసించే విధంగా ధ్వంసం చేశారన్నారు. భారత సైన్యం ఉగ్రవాదుల ఇళ్ళు, శిబిరాలు, స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశారన్నారు.
నేపాల్లో భారత విమానాన్ని హైజాక్ చేసి ఆప్ఘనిస్తాన్కు తీసుకెళ్లి బ్లాక్ మెయిల్ చేసిన ఉగ్రవాదులు కూడా ఈ ఆపరేషన్లో హతమయ్యారన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందన్నారు. జమ్ము కశ్మీర్లోనే 46 వేల మంది పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల వల్ల, అలాగే ఇతర యుద్ధాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాదు సహా అనేక ప్రాంతాల్లో పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరిత ఉగ్రవాదులు దేశ సమగ్రత, సమైక్యత, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు.
గతంలో హైదరాబాద్ నగరంలోని లుంబినీ పార్క్, కోఠి చాట్ బండార్, దిల్ సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ వద్ద ఉగ్రవాద బాంబుపేలుళ్లు జరిపి అమాయకులను హత్యచేశారు. ఆనాడు సంఘటన జరిగిన ప్రాంతాల్లో తాను స్వయంగా వెళ్లి పరిశీలించినట్టు కిషన్రెడ్డి తెలిపారు. ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ను మెహిదీపట్నం వద్ద దారుణంగా కాల్చి చంపారు. బిజెపి కార్పొరేటర్ నందరాజ్ గౌడ్ను అంబర్ పేట్లో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదులు దారుణంగా హత్య చేశారు. పార్లమెంటుపై దాడి, తాజ్ హోటల్పై దాడి, ముంబైలోని లోకల్ ట్రైన్లలో పేలుళ్లు, విమానాల హైజాక్, దేవాలయాల ధ్వంసం వంటి అనేక ఉగ్రవాద దాడుల వల్ల వేలమంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.ఉగ్రవాద ఘటనల తర్వాత క్యాండిల్ కాదు వెలిగించాల్సింది.. మిస్సైల్స్ వదలాలి.. బ్రహ్మోస్ ను వదిలి ఉగ్రవాదులను మట్టుబెట్టాలని, భారతదేశం అంటే ఉగ్రవాదులకు భయం పుట్టాలనేలా ప్రధాని నరేంద్ర మోదీ గట్టి సమాధానమిచ్చారన్నారు.ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం సమగ్ర విధానంతో, భారత సైనికులు తమ శక్తి, సామర్థ్యాలతో కొత్త చరిత్రను సృష్టించారన్నారు. సైనికశక్తిలో నూతన అధ్యాయం ప్రారంభమైందన్నారు.
2005, 2006లో పాకిస్థాన్ ఉగ్రవాదులు ముంబై లోకల్ ట్రైన్ బాంబుపేలుళ్లు జరపడంతో అనేక మంది మరణించినప్పటికీ, కాని, ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు గతంలో క్యాండిల్ ర్యాలీలకు మాత్రమే పరిమితమయ్యాం. 2016లో పాక్ ఉగ్రవాదులు ఉరిలో మన సైనికులపై దాడి చేయగా, భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. 2019లో ఉగ్రవాదులు పుల్వామాలో 40 మంది సైనికులు మానవ బాంబులతో చంపిన నేపథ్యంలో, భారత ఎయిర్ ఫోర్స్ ఫైటర్ విమానాలు జైషే మహమ్మద్ హెడ్క్వార్టర్స్పై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ప్రతీకారం తీర్చుకుంది.ఏప్రిల్ 22న పెహల్గామ్లో పాకిస్థాన్ ప్రేరిత ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత, మే 6,7 తేదీలలో కేవలం 23 నిమిషాల్లో భారత సైనికులు ఆపరేషన్ సిందూర్ పూర్తి చేసి ప్రతీకారం తీర్చుకున్నారు.ఆపరేషన్ సిందూర్లో పాక్లోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడముతో పాటు, ఐఎస్ఐ నెట్వర్క్ను కూడా ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.