Friday, January 30"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Nalanda University | ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నలంద విశ్వవిద్యాలయం విశిష్టతలు ఇవే..

Spread the love

Nalanda University | బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఉన్న న‌లంద యూనివ‌ర్సిటీలో కొత్త క్యాంప‌స్‌ను ఈరోజు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ (PM Modi) ఆవిష్క‌రించారు. అంత‌కు ముందు ప్ర‌ధాని మోదీ .. యునెస్కో వార‌స‌త్వ క‌ట్ట‌డమైన‌ న‌లంద మ‌హావీర‌ను సంద‌ర్శించారు.

Highlights

నలంద విశ్వ‌విద్యాలయానికి సంబంధించిన‌ పురాతన శిథిలాలకు 20 కి.మీ కంటే తక్కువ దూరంలోనే ఈ కొత్త క్యాంప‌స్‌ ఉంది. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయం. ఈ పురాతన విశ్వ‌విద్యాల‌యాన్ని 427 CEలో కుమారగుప్త చక్రవర్తి స్థాపించాడు. ఎనిమిది శతాబ్దాలకుపైగా నలంద విజ్ఞాన దీవిగా వర్ధిల్లింది. ఎంతో అనుభ‌వ‌జ్ఞ‌లైన వేద‌పండితులు ఇక్క‌డ బోధించేవారు. చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, శ్రీలంక, ఆగ్నేయాసియా వంటి సుదూర ప్రాంతాల నుండి 2,000 మంది ఉపాధ్యాయులు, 10,000 మంది విద్యార్థులతో అద్భుతమైన ఈ విద్యాల‌యం విల‌సిల్లింది. ప్రపంచంలోని మొట్టమొదటి రెసిడెన్షియ‌ల్‌ విశ్వవిద్యాలయంగా అత్యున్నత బోధ‌నా ప‌ద్ద‌తుల‌తో కీర్తిప్ర‌తిష్ట‌లు సంపాదించుకుంది.

నలంద అనేది ప్రాచీన భారతీయ వైద్య విధానమైన‌ ఆయుర్వేద విద్య‌తోపాటు విభిన్న మేధోపరమైన కార్యకలాపాలకు కేంద్రంగా ఉండేది. ప్రార్థనా మందిరాలు, త‌ర‌గ‌తి గదులతో ఓపెన్ క్యాంప‌స్ ల స్ఫూర్తితోనే ఆసియా అంతటా బౌద్ధ సంస్థలు వెలిశాయి.

భారతీయ గణిత శాస్త్ర పితామహుడైన ఆర్యభట్ట 6వ శతాబ్దం CEలో విశ్వవిద్యాలయానికి నాయకత్వం వహించినట్లు చెబుతారు. సున్నాను కనిపెట్టింది ఆర్య‌భ‌ట్ట‌ అని అంద‌రికీ తెలిసిందే.. ఆర్యభట్ట సిద్దాంతాలు, ఆవిష్కరణలు దక్షిణ భారతం, అరేబియా ద్వీపకల్పంలో గణిత, ఖగోళ శాస్త్రాల అభివృద్ధికి దోహదం చేశాయి.

ఆ కాలంలోనే నలందలో ప్రవేశం పొందడం ఎంతో సవాలుతో కూడుకొని ఉండేది. ఇందులో ప్ర‌వేశం కోరే విద్యార్థులు విశ్వవిద్యాలయంలోని టాప్ ప్రొఫెసర్‌లతో కఠినమైన మౌఖిక ఇంటర్వ్యూలను ఎదుర్కోవాల్సి వ‌చ్చేది. ఉత్తీర్ణులైన వారు ధర్మపాల. సిలభద్ర వంటి గౌరవనీయమైన బౌద్ధ గురువుల వ‌ద్ద శిక్షులుగా చేరేవారు. విశ్వవిద్యాలయానికి చెందిన‌ లైబ్రరీలో తొమ్మిది మిలియన్ల చేతిరాతతో కూడిన తాళపత్రాల గ్రంథాలు ఉండేవి. “మౌంటైన్ ఆఫ్ ట్రూత్” అని పిలువబడే ఈ లైబ్రరీ బౌద్ధ గ్రంధాలు, పండితుల రీస‌ర్చ్‌లు, పాఠ్యాంశాల పుస్తకాల నిధిగా ఉండేది.

దురదృష్టవశాత్తూ, 1190వ దశకంలో, ఈ విశిష్టమైన విజ్ఞాన‌ కేంద్రాన్ని టర్కో-ఆఫ్ఘన్ మిలిటరీ జనరల్ అయిన భక్తియార్ ఖిల్జీ చేతిలో అగ్నికి ఆహుతైంది. మూడు నెలల పాటు క్యాంపస్ మంటలు చెలరేగడంతో, బౌద్ధ జ్ఞానానికి సంబంధించిన‌ అత్యంత సంపన్నమైన రిపోజిటరీ బూడిదగా మారింది. దురదృష్టవశాత్తు, కొన్ని మాన్యుస్క్రిప్ట్‌లు మాత్రమే ఆ విధ్వంసం నుండి బయటపడ్డాయి, ఇప్పుడు లాస్ ఏంజిల్స్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్, టిబెట్‌లోని యార్లంగ్ మ్యూజియం వంటి సంస్థలలో భద్రపరచబడి ఉన్నాయి. ఆరు శతాబ్దాల తర్వాత, నలందను 1812లో స్కాటిష్ సర్వేయర్ ఫ్రాన్సిస్ బుకానన్-హామిల్టన్ తిరిగి కనుగొన్నారు. ఆ తర్వాత 1861లో సర్ అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్ దీనిని పురాతన విశ్వవిద్యాలయంగా గుర్తించారు.

2006లో అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ APJ అబ్దుల్ కలాం బీహార్ రాష్ట్ర శాసనసభ సమావేశాల సందర్భంగా న‌లంద (Nalanda University)  పున‌ర్మిర్మాణం గురించి సూచ‌న‌లు చేశారు. అప్ప‌టి నుంచి విశ్వవిద్యాలయం పునరుద్ధరణ ఊపందుకుంది. ఈ ఆలోచనకు బలమైన మద్దతు లభించింది. ఇది 2010లో నలంద విశ్వవిద్యాలయం బిల్లును ఆమోదించారు. సెప్టెంబర్ 2014 నాటికి, మొదటి బ్యాచ్ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఇది విశ్వవిద్యాలయానికి పునర్జన్మగా భావిస్తారు. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త క్యాంపస్ కోసం 455 ఎకరాలను కేటాయించి పునరుజ్జీవనానికి వేదికను ఏర్పాటు చేసింది.

ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ పద్మవిభూషణ్ దివంగత BV దోషి రూపొందించిన కొత్త క్యాంపస్, పురాతన వాస్తు సూత్రాలతో పర్యావరణ అనుకూలమైన నిర్మాణాన్నిచేప‌ట్టారు. పచ్చదనంతో క‌ళ‌క‌ళాడేలా కొత్త క్యాంప‌స్ ను తీర్చిదిద్దారు. జీరో కార్బన్ పాదముద్ర క్యాంపస్‌ను సృష్టించింది. ఈ కొత్త నలంద యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌.. నాటి భారతదేశ గొప్ప విద్యా వారసత్వం, విజ్ఞానం, ఆవిష్కరణలకు కొన‌సాగింపుగా నిల‌వ‌నుంది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *