Saturday, February 21"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

బెంగాల్‌లో SIR వివాదం: జ్యుడిషియల్‌ అధికారుల నియామకానికి సుప్రీంకోర్టు ఆదేశం

Spread the love

Bengal voter list revision controversy : పశ్చిమ బెంగాల్‌లో ఓటర్‌ జాబితాల సవరణ (SIR – Special Intensive Revision) ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ (Election Commission) మధ్య తీవ్ర వివాదం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక జోక్యం చేసుకుంది. ఓటర్ల జాబితా సవరణపై పరస్పర ఆరోపణలు, విమర్శలు కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన అత్యున్నత న్యాయస్థానం, ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జ్యుడిషియల్‌ అధికారులను నియమించాలని కోల్‌కతా హైకోర్టును ఆదేశించింది.

వివాదాల పరిష్కారానికి న్యాయాధికారులే బాధ్యత

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో వచ్చిన అభ్యంతరాలు, వివాదాలను జ్యుడిషియల్‌ ఆఫీసర్లు పరిశీలించి పరిష్కరిస్తారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అవసరమైతే జిల్లా జడ్జి హోదాలో పనిచేసిన మాజీ న్యాయాధికారులను కూడా ఈ ప్రక్రియలో నియమించాలని సూచించింది. అసాధారణ పరిస్థితుల కారణంగా అసాధారణ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది.

హైకోర్టు పర్యవేక్షణలో సమగ్ర ప్రణాళిక

జ్యుడిషియల్‌ అధికారుల నియామకం, వారి బాధ్యతలపై సమగ్ర ప్రణాళిక రూపొందించేందుకు కోల్‌కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సమావేశం కావాలని ఎన్నికల కమిషనర్‌, రాష్ట్ర చీఫ్‌ సెక్రటరీ, పోలీస్‌ చీఫ్‌ తదితర ఉన్నతాధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.

రాష్ట్ర ప్రభుత్వంపై అసంతృప్తి

రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని భావించామని, కానీ కమ్యూనికేషన్‌లో తీరుతెన్నులు ఆశాజనకంగా లేవని సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫిబ్రవరి 9న ఇచ్చిన ఆదేశాలకు ఫిబ్రవరి 17న మాత్రమే స్పందించారని, 8,500 మంది అధికారులను పంపామని చెప్పడం సరిపోదని వ్యాఖ్యానించింది. “మేము మైక్రో అబ్జర్వర్లు కాదు. ఈ వ్యవహారం మాకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది” అని ధర్మాసనం పేర్కొంది.

మమతా బెనర్జీ ఆరోపణలు – ఎన్నికల కమిషన్‌ ప్రతిస్పందన

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటరు జాబితా క్లీనప్‌ పేరుతో నిజమైన వోటర్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. అస్సాం వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇలాంటి ప్రక్రియ చేపట్టలేదని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తోందని కూడా విమర్శించారు.

అయితే ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్‌ ఖండించింది. తమ అధికారులు గౌరవంగా, సంయమనంతో వ్యవహరించారని, మమతా బెనర్జీ ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది.


పశ్చిమ బెంగాల్‌లో ఓటరు సవరణ ప్రక్రియ(West Bengal Voter List ) రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. జ్యుడిషియల్‌ పర్యవేక్షణతో ప్రక్రియ పారదర్శకంగా కొనసాగుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *