Supreme Court Quashes Gujarat Decision on Bilkis Bano Case : దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన గుజరాత్ (Gujarat)కు చెందిన బిల్కిస్ బానో (Bilkis Bano) కేసులో సుప్రీంకోర్టు సోమవారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుల్లో దోషులైన 11 మందిని జైలు నుంచి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.. అయితే గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ప్రభుత్వానికి క్షమాభిక్ష ఇచ్చే అధికారం లేదని స్పష్టంచేసింది. 11 మంది నిందితులను రెండు వారాల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలంటూ ఆదేశించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ తర్వాత ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ మహారాష్ట్ర లో జరిగినందు వల్ల .. దోషులకు రెమిషన్ మంజూరు చేసే అధికారం గుజరాత్ ప్రభుత్వానికి లేదని తెలిపింది. అలాగే.. ఈ కేసులో రెమిషన్ కోరుతూ దోషి చేసిన వినతిని పరిశీలించాలంటూ 2022 మార్చిలో సుప్రీంకోర్టు మరో బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై కూడా తాజా ధర్మాసనం స్పందించింది. వాస్తవాలను దాచి, మోసపూరిత దారుల్లో దోషి ఆ ఆదేశాలు పొందలేడని పేర్కొన్నది.
అసలేం జరిగింది..
గుజరాత్ లో 2002లో గోద్రా రైలు దహనకాండ సమయంలో చెలరేగిన అల్లర్లలో ఈ దారుణ అత్యాచార ఘటన జరిగింది. దుండగులు బిల్కిస్ బానో కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేసి.. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న 21 ఏళ్ల బానోపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఆమె మూడేళ్ల కుమార్తెతో సహా ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులు హత్యకు గురయ్యారు.
ఈ కేసులో విచారణ అనంతరం 11 మంది నిందితులను సీబీఐ ప్రత్యేక కోర్టు 2008, జనవరి 21వ తేదీన జీవితఖైదు విధించింది. బాంబే హైకోర్టు కూడా దీనిని సమర్థించింది. దోషులు 15 సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించారు. అనంతరం తమను విడుదల చేయాలంటూ ఒక నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి విజ్ఞప్తిని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఈ క్రమంలో ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
ఈ కేసులో నిందితులందరికీ రెమిషన్ మంజూరు చేయాలని కమిటీ సభ్యులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ క్రమంలో 2022, ఆగస్టు 15న రిలీజ్ చేసింది. అయితే, గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. దోషులకు శిక్షను రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దోషుల్లో ఒకడైన రాథేషామ్ షా న్యాయవాద వృత్తి కూడా ప్రారంభించాడు.
సుప్రీం కోర్టుకు బాధితురాలు..
దోషుల విడుదలను వ్యతిరేకిస్తూ బిల్కిస్ బానోతో పాటు మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారించిన సర్వోన్నత న్యాయస్థానం, గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగినందున మహారాష్ట్ర ప్రభుత్వ అధికారాలను.. గుజరాత్ ప్రభుత్వం అపహరించినట్లవుతుందని న్యాయమూర్తి తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన క్షమాభిక్షను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..