
మంత్రి కాన్వాయ్పై దాడితో రణరంగంగా మారిన జాతర!
Medaram Jatara Tension | తెలంగాణ కుంభమేళా మేడారం మహా జాతర (Medaram Jatara 2026) లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భక్తజన సంద్రమైన మేడారంలో పోలీసుల అత్యుత్సాహం, తోపులాటలు చివరకు లాఠీచార్జ్కు దారితీశాయి. అటు సామాన్య భక్తులు, ఇటు పోలీసు బలగాల మధ్య ఘర్షణతో సమ్మక్క సారలమ్మ సన్నిధి రణరంగంగా మారింది.
పోలీసుల వీరంగం.. భక్తుల ఆగ్రహం
సమ్మక్క ప్రధాన ద్వారం వద్ద భక్తులను నియంత్రించే క్రమంలో ఏఆర్ పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు లాఠీలతో విరుచుకుపడ్డారు. ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, సీఐ దయాకర్ సహా పలువురు అధికారులు భక్తులను ఈడ్చుకెళ్లి పిడిగుద్దులు గుప్పించడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ దాడిలో పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల ప్రవర్తనతో ఆగ్రహానికి గురైన భక్తులు పోలీసు బలగాలపైకి చెప్పులు విసిరి తమ నిరసనను తెలిపారు. సమ్మక్క ఆలయం వద్ద భక్తులు బైఠాయించి ఆందోళనకు దిగడంతో జాతరలో గందరగోళం నెలకొంది.
మంత్రి అడ్లూరి కాన్వాయ్పై దాడి
జాతరలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సమ్మక్క గద్దెపైకి చేరుకున్న తరుణంలో మొక్కులు చెల్లించుకునేందుకు సుమారు 30 లక్షల మంది భక్తులు పోటెత్తారు. ఈ రద్దీ సమయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ జంపన్న వాగు వద్ద చిక్కుకుపోయింది.
ఏం జరిగింది?
గంటకు పైగా మంత్రి కారు ట్రాఫిక్లో నిలిచిపోయింది. అదే సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చీకటి అలుముకుంది. మంత్రి అనుచరుల అత్యుత్సాహం, నిరంతర సైరన్ శబ్దాలకు విసిగిపోయిన భక్తులు ఒక్కసారిగా మంత్రి కాన్వాయ్పై దాడికి దిగారు.
- పరిస్థితికి కారణాలు:
గురువారం ఒక్కరోజే 30 లక్షల మందికి పైగా రావడం. - భారీ భక్తజనాన్ని నియంత్రించడంలో పోలీసుల వైఫల్యం మరియు లాఠీచార్జ్ చేయడం.
- సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్న సమయంలో మంత్రి కాన్వాయ్ సైరన్లతో వెళ్లడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది.

