Bharat Taxi లో డ్రైవర్లకే 80% ఆదాయం – అమిత్ షా కీలక ప్రకటన
Bharat Taxi : కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిల్లీలో భారత్ టాక్సీ డ్రైవర్లతో సమావేశమై, వారి సమస్యలు, సందేహాలను విన్నారు. ఇటీవల ప్రారంభించబడిన “భారత్ టాక్సీ” రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్ డ్రైవర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించబడిందని ఆయన స్పష్టం చేశారు. ఇతర ప్రైవేట్ కంపెనీల మాదిరిగా భారీ లాభాలను లక్ష్యంగా పెట్టుకోకుండా, డ్రైవర్లే యజమానులుగా ఉండే విధంగా ఈ ప్లాట్ఫామ్ పనిచేస్తుందని స్పష్టం చేశారు.
భారత్ టాక్సీ (Bharat Taxi) అంటే ఏమిటి?
భారత్ టాక్సీ, ఫిబ్రవరి 5న ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ మద్దతుతో పాటు అమూల్, ఇఫ్కో, నాబార్డ్ వంటి సహకార సంస్థల భాగస్వామ్యంతో రూపుదిద్దుకుంది.ఇది దేశంలో తొలి సహకార (కోఆపరేటివ్) రైడ్-హెయిలింగ్ ప్లాట్ఫామ్గా నిలిచింది. ఇతర యాప్లకు భిన్నంగా ఉంటుంది. దీని ద్వారా వచ్చే సంపాదనలో ప్రధాన భాగం డ్రైవర్లకే చేరుతుందని ప్రభుత్వం చెబుతోంది.
80% ఆదాయం డ్రైవర్లకే
ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ “డ్రైవర్లు సంపాదించే మొత్తం ఆదాయంలో 80 శాతం వారికే చెందుతుంది. కమీషన్లు ఉండవు. కేవలం నామమాత్రపు సభ్యత్వ రుసుము మాత్రమే ఉంటుంది. సర్జ్ ప్రైసింగ్ ఉండదు. ఛార్జీలు పారదర్శకంగా నిర్ణయించబడతాయి” అని తెలిపారు.
రూ.500 పెట్టుబడితో యజమాన్యం : భారత్ టాక్సీ ప్రత్యేకత ఏమిటంటే, డ్రైవర్లే కంపెనీ యజమానులుగా ఉంటారు. కేవలం రూ.500 పెట్టుబడితో ఈ ప్లాట్ఫామ్లో భాగస్వామ్యం కావచ్చు.
- కంపెనీ లాభాల్లో 20% డ్రైవర్ల వాటాగా కంపెనీ ఖాతాలో నిల్వ ఉంటుంది
- మిగిలిన 80% టాక్సీ కార్యకలాపాల ఆధారంగా డ్రైవర్లకు పంపిణీ అవుతుంది
- ఛార్జీల ఆదాయంతో పాటు లాభాల్లో కూడా వాటా లభిస్తుంది
- అన్ని ఖాతాలు పారదర్శకంగా అందుబాటులో ఉంటాయి
మూడు సంవత్సరాలు ఓపిక అవసరం
భారత్ టాక్సీ దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సమయం పడుతుందని, అందుకే డ్రైవర్లు కనీసం మూడు సంవత్సరాలు ఓపికగా ఉండాలని అమిత్ షా కోరారు. “ఇంతకుముందు కంపెనీల యజమానులు సంపన్నులయ్యారు. ఇప్పుడు మీరు యజమానులు. మీ కష్టానికి మీకే లాభం రావాలి. భారత్ టాక్సీ మిమ్మల్ని దోపిడీ చేయదు” అని ఆయన హామీ ఇచ్చారు.

