Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Mid day Meal : పేద విద్యార్థుల క‌డుపు నింపుతున్న అక్ష‌య పాత్ర‌

Spread the love

వరంగల్‌ లోని సర్కారు బడుల్లో పిల్లలకు రుచికరమైన మధ్యాహ్న భోజనం ప్రారంభం

Mid day meal by Akshsy Patra | ఉడికీ ఉడ‌క‌ని అన్నం, నీళ్ల చారు.. రుచిప‌చీ లేని సాంబారు నుంచి పేద విద్యార్థుల‌కు విముక్తి ల‌భించింది. ఇక‌పై ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల‌కు క‌డుపు నిండా రుచిక‌ర‌మై భోజ‌నం (Mid day meal ) అందించేందుకు అక్ష‌య‌పాత్ర స్వ‌చ్ఛంద సంస్థ ముందుకు వ‌చ్చింది. వ‌రంగ‌ల్ కాశిబుగ్గ‌లోని న‌రేంద్ర‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ పాఠ‌శాలతోపాటు వ‌రంగ‌ల్ కృష్ణాకాల‌నీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లోని విద్యార్థుల కోసం ఈరోజు (ఆగ‌స్టు 11)న అక్ష‌య పాత్ర స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా మ‌ధ్యాహ్న‌భోజ‌న ప‌థ‌కం ప్రారంభించింది. ఇందులో భాగంగా మ‌ధ్యాహ్నం న‌రేంద్ర‌న‌గ‌ర్ ప్ర‌భుత్వ‌ ఉన్న‌త‌పాఠ‌శాలలోని సుమారు 757 మంది, ప్రాథ‌మిక పాఠ‌శాల‌లోని 275 మంది అలాగే కృష్ణాకాల‌నీలోని ప్ర‌భుత్వ ఉన్న‌త పాఠ‌శాల‌లోని 425 మంది పిల్ల‌ల‌కు రుచిక‌ర‌మైన భోజ‌నాన్ని అందించింది.

ఆనందంగా భోజ‌నం చేసిన చిన్నారులు

ఇన్నాళ్లు నాణ్య‌త లేని భోజ‌నాల‌తో అనేక ఇబ్బందులు ప‌డిన పిల్ల‌ల‌కు మొద‌టిరోజు వివిధ మిక్స్‌డ్ వెజిటెబుల్ క‌ర్రీ, అన్నంతోపాటు సేమియా స్వీట్ అందించ‌డంతో విద్యార్థుల ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి. భోజ‌నం చాలా బాగుంద‌ని, గ‌తంలో ఇలాంటి భోజనం చేయ‌లేద‌ని ప‌లువురు తెలిపారు. విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లోనూ ఆనందం వ్య‌క్త‌మైంది.

కొన్నాళ్లుగా ఇంటి నుంచే భోజ‌నం

న‌రేంద్ర న‌గ‌ర్ ప్రభుత్వ పాఠ‌శాల‌లో వెయ్యికి పైగా విద్యార్థులు చ‌దువుకుంటున్నారు. అయితే ఇక్క‌డ చాలారోజులుగా నాణ్య‌త లేని భోజ‌నం పెడుతున్నార‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. నీళ్ల చారు, సాంబారు, రుచిలేని కూర‌ల‌తో మా పిల్లలు స‌రిగ్గా భోజ‌నం చేసేవారు కాద‌ని అందుకే ఇంటి నుంచే మ‌ధ్యాహ్న భోజ‌నం పంపిస్తున్నామ‌ని ప‌లువురు త‌ల్లిదండ్రులు పేర్కొన్నారు. మ‌రోవైపు మెనూ కూడా స‌క్ర‌మంగా పాటించ‌లేద‌నే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్ క‌లెక్ట‌ర్ సత్యశారద (Collector Satya Sharada) చొర‌వ‌తో నేడు పిల్లలు ఎంతో ఆనందంగా ఈరోజు మధ్యాహ్నం భోజనం చేశారు.

మధ్యాహ్న భోజన సిబ్బంది ఆందోళన..

నరేంద్రనగర్​ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజన సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. అక్షయ పాత్ర (Akshsy Patra ) ద్వారా మధ్యాహ్న భోజనం అందిస్తే తమకు ఉపాధి కరువైపోతుందని కలెక్టర్​ను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ఇకపై పిల్లలకు నాణ్యమైన భోజనంతోపాటు క్రమం తప్పకుండా మెనూ ప్రకారం గుడ్డును కూడా అందిస్తామని ప్రతీ తరగతి గది వెళ్లి విద్యార్థులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ రోజు అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థ అందించిన భోజనం గతంలో కంటే ఎంతో బాగుందని. తమకు ఇదే కొనసాగించాలని పలువురు విద్యార్థులు మీడియా ప్రతినిధులకు వెల్లడించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *