
యూపీలో షాకింగ్ ఇన్సిడెంట్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఒక్క బుల్లెట్తో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. నిజానికి ఓ వ్యక్తి మొదట తన భార్యను కౌగిలించుకుని, ఆ తర్వాత ఆమె వీపు వెనుక భాగంలో రివాల్వర్ తో కాల్చాడు. ఆ బుల్లెట్ తో భార్యభర్తలిద్దరూ ప్రాణాలు విడిచారు. ఈ వార్తపై చూసి అందరూ షాక్ కు గురయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనెక్ పాల్ (40), అతని 38 ఏళ్ల భార్య సుమన్ పాల్ దంపతులకు ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరూ చండీగఢ్లో దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం మొరాదాబాద్ కు వలస వచ్చాడు. జూన్ 13- 14 మధ్య రాత్రి బిలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాన్పూర్ గ్రామంలో ఈ సంఘటన జరిగిందని మొరాదాబాద్(moradabad) రూరల్ పోలీసు సూపరింటెండెంట్ సందీప్ కుమార్ తెలిపారు.
భార్యభర్తలిద్దరూ తరచూ గొడవపడేవారని దంపతుల బంధువులు, పిల్లలు పోలీసులకు తెలిపారు. గత కొద్ది రోజులుగా వీరి గొడవలు తీవ్రమయ్యాయి. జూన్ 13న రాత్రి అనేక్ పాల్ ఇంట్లో విచిత్రమైన పూజ చేసి, ఆపై తన భార్యను కౌగిలించుకున్నాడు. భార్యను కౌగిలించుకున్న తర్వాత తుపాకితో కాల్చాడు. అదే బుల్లెట్ అనేక్ పాల్ ఛాతీకి తగిలి అతని వీపు గుండా వెళ్లింది. బుల్లెట్తో ఇద్దరికీ గాయాలయ్యాయి. వీరిద్దనినీ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కలేదు. కాగా దంపతుల మృతితో నలుగురు పిల్లలు అనాథలుగా మారారు.
కాల్పులకు ముందు భర్త చేతబడి చేశాడా?
మృతుల బంధువుల నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఉపయోగించిన ఆయుధం దేశీయ తుపాకీ. అనేక్ పాల్కి ఈ తుపాకీ ఎక్కడి నుంచి ఎలా లభించిందనే కోణంలో విచారణ జరుగుతోంది. ఘటనకు ముందు భర్త చేతబడి చేసి ఉంటాడని భావిస్తున్నారు. దీనిపై కూడా ఆరా తీస్తున్నారు.