
Hyderabad : రాష్ట్రంలో గో సంరక్షణ కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. గోవులను కాపాడేందుకు వివిధ రాష్ట్రాల్లోని విధానాల అధ్యయనానికి ముగ్గురు అధికారులతో ఒక కమిటీ ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నియమించారు. పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావుతో కూడిన కమిటీ ఈ విషయంలో లోతైన అధ్యయనం చేయాలని ఆయన ఆదేశించారు.
రాష్ట్రంలో గో సంరక్షణపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తన నివాసంలో సమీక్ష సమావేశంలో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు. భక్తులు గోశాలలకు పెద్ద సంఖ్యలో గోవులు దానం చేస్తున్నారని… స్థలాభావం, ఇతర సమస్యలతో అవి తరచూ మృత్యువాత పడుతున్నాయని సీఎం తెలిపారు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించి గోవుల సంరక్షించేందుకు రాష్ట్రంలోని నాలుగు ప్రదేశాల్లో అత్యాధునిక వసతులతో గోశాలలు నిర్మించాలని సీఎం సూచించారు.
ప్రముఖ దేవస్థానాల ఆధ్వర్యంలో కోడె మొక్కులు చెల్లించే వేములవాడ, యాదగిరిగుట్ట, హైదరాబాద్ నగర సమీపంలోని ఎనికేపల్లి, పశు సంవర్థక శాఖ విశ్వ విద్యాలయం సమీపంలో విశాల ప్రదేశాల్లో గోశాలలు నిర్మించాలని సూచించారు. భక్తులు అత్యధిక భక్తిశ్రద్ధలతో సమర్పించే కోడెల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపర్చాలని సీఎం సూచించారు. వేములవాడ సమీపంలో వంద ఎకరాలకు తక్కువ కాకుండా గోశాల ఉండాలని సీఎం తెలిపారు. గో సంరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదని సీఎం స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో గోశాలల నిర్వహణకు సంబంధించిన అప్రోచ్ పేపర్ను అధికారులు సీఎంకు అందజేశారు