
- 28న కన్నెపల్లి నుంచి సారలమ్మ రాక జాతర ఆరంభం
- 29న చిలకలగుట్ట నుంచి సమ్మక్క కుంకుమ గద్దెపైకి.. ఇదే ప్రధాన ఘట్టం
- 30న భక్తుల దర్శనం
- 31న అమ్మవార్ల వనప్రవేశంతో మేడారం మహాజాతర పరిసమాప్తం
వరంగల్/ములుగు: తెలంగాణ కుంభమేళా, కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మల మహాజాతర (Medaram Jatara 2026)కు ములుగు జిల్లా మేడారం ముస్తాబైంది. బుధవారం నుండి ప్రారంభం కానున్న ఈ నాలుగు రోజుల వేడుక కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేసింది.
నేడే తొలి ఘట్టం: పగిడిద్దరాజు, జంపన్నల ఆగమనం
జాతరలో మొదటి రోజైన బుధవారం అత్యంత కీలకమైన ఘట్టాలు చోటుచేసుకోనున్నాయి:
- పగిడిద్దరాజు రాక: మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును పెళ్లికొడుకుగా ముస్తాబు చేసి, కాలినడకన మేడారానికి తీసుకువస్తారు. గద్దెలపై పగిడిద్దరాజును ప్రతిష్ఠించడంతో జాతర అధికారికంగా ప్రారంభమవుతుంది.
- జంపన్న గద్దెకు: కన్నెపల్లి నుంచి పోలెబోయిన వంశీయులు జంపన్నను రాత్రి 7 గంటలకు జంపన్నవాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి తీసుకువస్తారు.
ఈసారి జాతరలో నూతన ఆకర్షణలు & ఆధునిక సౌకర్యాలు
గతంలో లాగా కాకుండా, ఈసారి భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం వినూత్న సాంకేతికతను జోడించింది:
- రాతి కట్టడాలు & శిల్పకళ: రూ. 251 కోట్లతో గద్దెల ప్రాంగణాన్ని మరో రెండు శతాబ్దాల వరకు చెక్కుచెదరకుండా ఉండేలా రాతి కట్టడాలతో నిర్మించారు. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించే శిల్పాలు భక్తులను కట్టుకుంటున్నాయి.
- ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్స్: జాతరలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈసారి కొత్తగా ‘ట్రాకింగ్ రిస్ట్ బ్యాండ్స్’ ప్రవేశపెట్టారు. వీటి ద్వారా తప్పిపోయిన పిల్లలను సులభంగా గుర్తించవచ్చు.
- హెలికాప్టర్ సేవలు: ప్రయాణ ప్రయాస తగ్గించేందుకు ముందస్తుగా బుక్ చేసుకున్న భక్తుల కోసం హెలికాప్టర్ సౌకర్యం అందుబాటులో ఉంది.
- క్యూ లైన్ల విస్తరణ: ఒకేసారి 9 నుండి 10 వేల మంది దర్శించుకునేలా ప్రాకారాన్ని విస్తరించారు. గద్దెలన్నీ ఒకే వరుసలో ఉండేలా మార్పులు చేశారు.
రవాణా మరియు ట్రాఫిక్ నియంత్రణ
- ఆర్టీసీ బస్సులు: 4,000 బస్సులతో 20 లక్షల మందిని చేరవేసేలా ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం (మహాలక్ష్మి) వర్తిస్తుంది. 1500 ఎకరాల్లో 33 చోట్ల 3 లక్షల వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను సిద్ధం చేశారు. ట్రాఫిక్ చిక్కులను పర్యవేక్షించేందుకు పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మరియు ప్రత్యేక యాప్ను వినియోగిస్తున్నారు.
భక్తులకు సూచనలు:
- స్నానఘాట్లు: జంపన్నవాగు వద్ద నీటి ఎద్దడి లేకుండా మోటార్ల ద్వారా నీటిని నింపుతున్నారు. 350 మంది ఈతగాళ్లు పహారా కాస్తున్నారు. అటవీ ప్రాంతం కాబట్టి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, పర్యావరణాన్ని కాపాడాలని అధికారులు కోరుతున్నారు.

