Saturday, February 14"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

హైదరాబాద్ సంస్థానంపై సైనిక చర్య తర్వాత ఏం జరిగింది..? కాసీం రజ్వీ కథ ఎలా ముగిసింది..?

Spread the love

ఆధునిక హైదరాబాద్ చరిత్రలో సెప్టెంబర్ 1948 ఒక మలుపు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అన్ని సంస్థానాలు భారత యూనియన్ లో విలీనమయ్యాయి. కానీ హైదరాబాద్ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ నిరాకరించాడు. అతడి ప్రైవేట్ సన్యమైన కాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు తెలంగాణ ప్రాంతంలో రెచ్చిపోయారు. వారి ఆగడాలకు హద్దులేకుండా పోయింది. దీంతో అప్పటి భారత ప్రభుత్వం 1948 సెప్టెంబరు 13న హైదరాబాద్ సంస్థానంపై
సైనిక చర్య చేపట్టింది. తర్వాత నిజాం రాజ్యం భారతీయ యూనియన్ లోవిలీనమైంది.

పదవీచ్యుతుడైన నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌పై భారత ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదు.. కానీ హైదరాబాద్ ప్రధాని లైక్ అలీ, అతని మంత్రివర్గంలోని సభ్యులను గృహనిర్బంధంలో ఉంచారు. రజాకార్ల నాయకుడు
కాసిం రజ్వీ, అతని సహచరులపై హత్య, దహనం, దోపిడి వంటి వివిధ కేసులలో అరెస్టు చేశారు.
నెహ్రు నేతృత్వంలోని ఇండియన్ యూనియన్ కు హైదరాబాద్ సంస్థానం పునరుద్ధరణపై అనేక సవాళ్లు మందున్నాయి. తెలంగాణ ప్రాంతంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడం, రజాకార్ల సాయుధ ముఠాలను అరెస్టు చేయడం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా మారింది. రజాకర్లపై కేసులు నమోదు కాగానే, వారు చేసిన నేరాలకు సంబంధించి వారిని విచారించాల్సి ఉంటుంది.
కానీ ‘ఢిల్లీలోని ఎర్రకోటపై త్వరలో నిజాం జెండా ఎగురుతుంది’ అని రజ్వీ చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగం తీవ్ర  ప్రకంపనలు రేపింది. దీంతో న్యూఢిల్లీలోని ఎర్రకోటలోని ప్రత్యేక కోర్టులో కాసిం రజ్వీని విచారించనున్నట్లు సెప్టెంబర్ 20న మిలటరీ గవర్నర్ ప్రకటించారు.
జనరల్ చౌధురి ప్రకటన దేశ రాజధానికి చేరడంతో, కేంద్ర నాయకత్వం షాక్ అయ్యింది. ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ హోం మంత్రి వల్లభ్‌భాయ్ పటేల్‌కు లేఖ పంపారు. “ఇది తెలివైన పని అని నేను అనుకోను. అతన్ని (రజ్వీ) హైదరాబాద్ రాష్ట్రంలో ఉంచడం మంచిది, కానీ హైదరాబాద్ నగరంలో కాదు” అని నెహ్రూ రాశారు.

రజ్వీ విచారణ హైదరాబాద్ రాష్ట్రంలోనే జరగాలని, తక్కువ వ్యవధిలో విచారణ పూర్తి చేయాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో న్యూఢిల్లీ గాడ్సేపై విచారణ జరుగుతోంది. అని పేర్కొన్నారు. ఈ వార్తను చూసిన తర్వాత, గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి కూడా మిలటరీ గవర్నర్ ప్రణాళికపై తన ఆందోళనను వ్యక్తం చేస్తూ నెహ్రూకు లేఖ రాశారు.

నెహ్రూతో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏకీభవించారు.. “ఎర్రకోట చాలా పవిత్రమైనది. రజ్వీ వంటి మతోన్మాద రకానికి చెందిన సాధారణ రఫ్ఫియన్‌పై విచారణకు చారిత్రాత్మకంగా ముఖ్యమైన ప్రదేశం” అని పేర్కొన్నాడు.

హైదరాబాదు రాష్ట్ర జైలులో ప్రత్యేక ట్రిబ్యునల్ ద్వారా విచారణ జరిగేలా చూడాలని హోం శాఖ కార్యదర్శి వీపీ మీనన్‌ను తాను ఇప్పటికే ఆదేశించానని, పకబ్బందీగా విచారించాలని పటేల్ ఆయన ప్రధానికి తెలిపారు.” ఇలాంటి మతోన్మాదులపై సుదీర్ఘ విచారణలు మతపరమైన ఉద్రిక్తతను సృష్టించే అవకాశం ఉంది. అతను హైదరాబాద్ నగరంలో ఉండటం ప్రమాదకరం.. బహుశా సైనిక అధికారులు అతన్ని ఏదో ఒక రహస్య ప్రదేశంలో ఉంచాలని అనుకోవచ్చు, కానీ అతనిని ఢిల్లీకి తీసుకురాకూడదని నేను మీతో పూర్తిగా అంగీకరిస్తున్నాను. అని” పటేల్ రాశాడు.

ఈక్రమంలో దాదాపు 1,500 మంది రజాకార్లను అదుపులోకి తీసుకుని వేర్వేరు నేరాలపై కేసును నమోదు చేశారు. అయితే వారి విచారణలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో హైదరాబాద్‌లోని కొన్ని చోట్ల విమర్శలకు దారితీసింది.

సరోజినీ నాయుడు కుమారుడు డాక్టర్ జైసూర్య.. సైనిక ప్రభుత్వం లోపభూయిష్ట వైఖరిని విమర్శిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖను నెహ్రూ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన దానిని హోంమంత్రికి పంపించారు. హైదరాబాద్‌లో దర్యాప్తు
అధికారులు లేకపోవడం వల్లనే జాప్యం జరిగిందని నెహ్రూకు వివరించాలని పటేల్ కోరాడు.

“స్థానిక పోలీసులలో అధిక శాతం మంది నిందితులను విడిచిపెట్టారు.. లేదా ఏ సందర్భంలోనైనా, స్థానిక పోలీసులను విశ్వసించడం సాధ్యం కాదు.. ఎందుకంటే వారిలో మతపరమైన పక్షపాతం ఉంటుంది. కొంత కష్టమైనా మేము ప్రావిన్సుల నుండి కొంతమంది పోలీసు అధికారులను పంపిస్తాం” అని పటేల్ నెహ్రూకు తెలియజేశారు.

బురఖా ధరించి తప్పించుకుని..

స్థానిక పోలీసుల అలసత్వం కారణంగా, కొంతమంది ముఖ్యమైన సాక్షులు, కాసిం రజ్వీ కుటుంబ సభ్యులు అదృశ్యమయ్యారు. విచారణకు మరిన్ని సమస్యలు వచ్చాయి. మరోవైపు హైదరాబాద్ పోలీసులలో ఉన్న రజాకార్ల
అనుకూల వర్గాల కారణంగా.. పదవీచ్యుతుడైన హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రి లియాకత్ అలీ.. బురఖా ధరించి గృహనిర్బంధం నుంచి తప్పించుకుని పాకిస్తాన్‌లో దిగగలిగారు.

కాసిం రజ్వీ, అతని సహచరులపై విచారించిన అనేక కేసులలో ఆగస్ట్ 1948లో జర్నలిస్టు షూబుల్లా ఖాన్ హత్య కూడా ముఖ్యమైన వాటిల్లో ఒకటి. ఖాన్ రజాకార్లను తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ కేసులో, రజ్వీ, ఇతరులను ప్రత్యేక
ట్రిబ్యునల్ దోషులుగా నిర్ధారించింది. అయితే వారు హైకోర్టులో నిర్దోషులుగా విడుదలయ్యారు. రజ్వీ ఇతర కేసులను కూడా పై కోర్టులకు లాగారు.

చివరికి, అతను వేర్వేరు కేసులలో శిక్ష అనుభవించాడు. కానీ ఈ శిక్షలు ఏకకాలంలో అమలు అయ్యాయి. గరిష్ఠంగా శిక్షాకాలం అంటే ఏడేళ్లపాటు జైలులోనే ఉన్నాడు. రజ్వీని మొదట హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైలులో
ఉంచారు. అయితే జైలు సిబ్బంది పక్షపాత వైఖరి కారణంగా అతను తరువాత పూణేలోని ఎరవాడ జైలుకు తరలించబడ్డాడు. అక్కడ శిక్షాకాలం పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 1957లో విడుదలయ్యాడు.

అతను రెండు రోజులు హైదరాబాద్‌కు వచ్చి, ఆపై కరాచీకి వెళ్లిపోయాడు, అక్కడ అతను 1970లో మరణించాడు. లైక్ అలీ అదే సంవత్సరం న్యూయార్క్‌లో మరణించాడు. అలా నిజాం కాలంలో ఘోర అరాచకాలు సృష్టించిన ఇద్దరు మతోన్మాదుల కథ ముగిసింది.


పరకాల అమరదామం.. నెత్తుటి చరిత్రకు సాక్షం..

 

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *