సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య
![సర్వీసు రివాల్వర్ తో కాల్చుకొని డీఐజీ ఆత్మహత్య](https://vandebhaarath.com/wp-content/uploads/2023/07/tamilanadu-DIG-vijay-kumar.jpg)
తమిళనాడు కొయంబత్తూరులో షాకింగ్ ఘటన
డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (కోయంబత్తూరు రేంజ్) విజయకుమార్ IPS తమిళనాడులోని కోయంబత్తూరులోని తన అధికారిక నివాసంలో సర్వీస్ రివాల్వర్ తో
కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు.
రేస్ కోర్స్ సమీపంలోని రెడ్ ఫీల్డ్స్లోని తన అధికారిక నివాసంలో శుక్రవారం ఉదయం 6.15 గంటల ప్రాంతంలో డీఐజీ విజయకుమార్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య
చేసుకున్నారు. విజయకుమార్ నిద్రలేమి కారణంగా తీవ్ర డిప్రెషన్లో ఉన్నారని విశ్వనీయవర్గాల ద్వారా తెలిసింది. అతని కుటుంబాన్ని కొద్ది రోజుల క్రితమే చెన్నై నుండి
కోయంబత్తూరుకు తీసుకువచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయకుమార్ తన అధికారిక నివాసంలో డ్యూటీలో ఉన్న గన్మ్యాన్ నుంచి తీసుకున్న సర్వీస్ పిస్టల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని నివాసంలో ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే సీనియర్ అధికారులను అప్రమత్తం చేసి,
మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.
2009-బ్యాచ్ IPS అధికారి, విజయకుమార్ ఈ ఏడాది జనవరిలో కోయంబత్తూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూర్లకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా, అలాగే అన్నానగర్ డిప్యూటీ కమిషనర్గా పనిచేశారు.
ముఖ్యమంత్రి సంతాపం
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్వీట్ చేస్తూ, ” పోలీసు ఉన్నతాధికారి విజయకుమార్ అకాల మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యా. చాలా బాధ కలిగించింది. అతను జిల్లా పోలీసు సూపరింటెండెంట్గా సహా వివిధ హోదాల్లో ఎంతో క్రమశిక్షణతో వకడ్బందీగా విధులు నిర్వర్తించారు. ఆయన మరణం తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్కు , తీవ్రమైన నష్టమని తెలిపారు. అతని కుటుంబ సభ్యులకు పోలీసు బలగాల్లోని స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అని పేర్కొన్నారు.