
Dharani Portal | హైదరాబాద్ : ధరణి పోర్టల్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోర్టల్ నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్)కి అప్పగిస్తూ ఈరోజు ఉత్వర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీలకు సంబంధించిన అంశాలను మూడు సంవత్సరాల పాటు నిర్వహించాలని, పనితీరు బాగుంటే మరో రెండేళ్లు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది. గత బిఆర్ఎస్ ప్రబుత్వం 2020 అక్టోబర్ 29న ధరణి పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చి దాని నిర్వహణ బాధ్యతను టెర్రా సీఐఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే కంపెనీకి కట్టబెట్టింది. అప్పటి నుంచి వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోళ్లు పూర్తిగా ధరణి పోర్టల్ ద్వారానే కొనసాగుతున్నాయి. ఈ పోర్టల్లో ప్రస్తుతం 35 రకాల మాడ్యుల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతీ సమస్యకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఫీజులను ధరణి పోర్టల్ ఆన్లైన్లోనే వసూలు చేస్తున్నారు. భూ సమస్యల పరిష్కారానికి ఒక్కో అప్లికేషన్కు రూ.వెయ్యి చొప్పున వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం సుమారు 40 లక్షల లావాదేవీలు జరిగినట్లు సమాచారం..
అయితే ప్రాథమిక సమాచారం నమోదులో జరిగిన జాప్యం కారణంగా రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు. ఎప్పుడో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న భూములకు, గతంలో అమ్మిన వాళ్ల పేర్లే పోర్టర్ లో చూపించడం, కొన్నిచోట్ల పట్టా భూములు ప్రభుత్వ భూములుగా, అసైన్డ్ భూములుగా నమోదు కావడం వంటివి జరిగాయి. అలాగే విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు.. పట్టా భూమి ఐనప్పటికీ నిషేధిత జాబితాలో ఉండటం. పేర్లు తప్పుగా నమోదు కావడం, కొందరు భూములు అసలు ధరణిలోనే నమోదు కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి ప్రక్షాళన చేపట్టింది. ఇందుకోసం సబ్ కమిటీ వేసి విచారణ చేపట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ పీటర్ అడ్వొకేట్ సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ తో ఏర్పడిన కమిటీ ధరణీ సమస్యలు, పరిష్కారాలపై అధ్యయనం చేసింది. ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతను ఎన్ఐసీకి అప్పగిస్తున్న నేపథ్యంలో ఈ నెల 25న సెక్రటేరియట్ లో సమావేశం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ సమావేశానికి ప్రస్తుతం పోర్టల్ నిర్వహిస్తున్న టెర్రా సీఐఎస్ టెక్నాలజీస్ కంపెనీ ప్రతినిధులతో పాటు, నూతనంగా బాధ్యతలు నిర్వర్తించనున్న ఎన్ఐసీ అధికారులు, సాంకేతిక నిపుణులు, తెలంగాణ టెక్నాలజీ సర్విసెస్ అధికారులు హాజరుకావాలని సూచించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..