భార్య, పిల్లలను చంపిన అజారుద్దీన్ అరెస్ట్.. డాక్టర్ల ముఠా గుట్టు రట్టు! Warangal Punnelu murder case
Warangal Punnelu murder case mystery : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన పున్నెలు స్విమ్మింగ్ పూల్ ఘటన ప్రమాదం కాదు.. పక్కా ప్లాన్తో జరిగిన ఘాతుకం అని పోలీసులు తేల్చారు. పరాయి మోజులో పడి, తనకు కొడుకులు కావాలని, రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నారనే నెపంతో కన్నబిడ్డలను, కట్టుకున్న భార్యను స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపిన కిరాతక భర్త అజారుద్దీన్తో పాటు, ఈ కుట్రలో భాగస్వాములైన మరో 9 మందిని వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్ ఈ కేసుకు సంబంధించిన సంచలన నిజాలను మీడియా ముందు వెల్లడించారు.
కుమారుడు కావాలనే వేధింపులు.. అమానుషంగా అబార్షన్లు!
ఐనవోలు మండలం పున్నెలు గ్రామానికి చెందిన అజారుద్దీన్, ఫరహాత్ 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, కుమారుడు కావాలనే కోరికతో అజారుద్దీన్ కుటుంబ సభ్యులు ఫరహాత్ను వేధించేవారు. గతంలో ఆమె గర్భం దాల్చిన ప్రతిసారి అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి, ఆడపిల్ల అని తెలియగానే బలవంతంగా అబార్షన్లు చేయించేవారని పోలీసుల విచారణలో తేలింది.
మైనర్ బాలిక కోసం.. ముగ్గురిని బలితీసుకున్న మృగం
నిందితుడు అజారుద్దీన్ తన దూరపు బంధువైన ఓ మైనర్ బాలికను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే భార్యాపిల్లలు ఉన్న నిన్ను పెళ్లి చేసుకోనని ఆ బాలిక తిరస్కరించడంతో, వారిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి ఐస్ క్రీం తినిపిస్తానని నమ్మించి, తన స్విమ్మింగ్ పూల్ వద్దకు తీసుకెళ్లి, కరెంట్ కనెక్షన్, సీసీ కెమెరాలు తొలగించి ముగ్గురినీ నీటిలో ముంచి ప్రాణాలు పోయే వరకు వదలలేదు.
Warangal Punnelu murder case : ముఠా గుట్టు రట్టు.. డాక్టర్ల అరెస్ట్
ఈ కేసు దర్యాప్తులో భాగంగా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్న ముఠా గుట్టును కూడా పోలీసులు రట్టు చేశారు.
- అరెస్ట్ అయిన వారు: ప్రధాన నిందితుడు అజారుద్దీన్, అతని కుటుంబ సభ్యులు చాంద్ పాషా, సలీహా, షరోద్దీన్. వీరితో పాటు ఆర్.ఎం.పి నరేష్, నర్సు స్రవంతి, ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్ సహా 10 మంది.
- పరారీలో డాక్టర్లు: అబార్షన్లు చేసిన డాక్టర్ రవళి, డాక్టర్ పూర్ణిమ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

