RSS Shakha Sangamam | కాశిబుగ్గలో అంబరాన్నంటిన ‘ఆర్ఎస్ఎస్ శాఖల సంగమం’
- ఓసిటీ హనుమాన్ దేవాలయ మైదానంలో స్వయంసేవకుల ప్రార్థన
- 100 ఏళ్ల ప్రస్థానం.. వ్యక్తి నిర్మాణమే లక్ష్యంగా సంఘం కృషి
- హిందూ సమాజ ఐక్యతతోనే దేశాభివృద్ధి – ముఖ్యవక్త హనుమా రెడ్డి
వరంగల్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది వేడుకల్లో భాగంగా కాశిబుగ్గ నగర్ ‘శాఖల సంగమం’ (RSS Shakha Sangamam) కార్యక్రమం ఆదివారం ఉదయం అత్యంత క్రమశిక్షణతో, ఉత్సాహభరితంగా సాగింది. కాశిబుగ్గ నగర్ పరిధిలోని ఎల్బినగర్, తిలక్బస్తీ, అబ్బనికుంట, సొసైటీకాలనీ, కోటిలింగాల బస్తీ, ధర్మారం, మొగిలిచర్ల బస్తీలకు చెందిన శాఖలు ఓసిటీ హనుమాన్ దేవాలయం ముందున్న మైదానంలో ఏకమై, సమష్టిగా శాఖలు, సామూహిక క్రీడలు, ఆటపాటలు, ప్రార్థన నిర్వహించాయి. ఈ అపురూప దృశ్యమాలిక స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
దేశం కోసం పనిచేయడమే పరమావధి: హనుమా రెడ్డి
ఈ కార్యక్రమానికి ముఖ్యవక్తగా విచ్చేసిన శ్రీ హనుమా రెడ్డి గారు స్వయంసేవకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖ ప్రాముఖ్యత గురించి వివరించారు. సంఘంలో ‘శాఖ’ అనేది కేవలం వ్యాయామం చేసే చోటు మాత్రమే కాదని, అది ఒక వ్యక్తి నిర్మాణ కేంద్రమని అన్నారు. నిరంతర సాధన ద్వారా వ్యక్తిత్వ వికాసం చెంది, సమాజానికి ఉపయోగపడే కార్యకర్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
మనలో ఐక్యత, దేశభక్తి ఉండాలని, హిందూ సమాజం ఐక్యంగా ఉన్నప్పుడే దేశం బలంగా ఉంటుందని, స్వయంసేవకులు ఎల్లప్పుడూ దేశహితం కోసమే పనిచేయాలని ఉద్బోధించారు. 1925 విజయదశమి నాడు ప్రారంభమైన సంఘం.. నేడు 100 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోందని, భారతమాతను మళ్ళీ విశ్వగురువుగా నిలబెట్టడమే ప్రతి స్వయంసేవకుని లక్ష్యం కావాలని ఆయన ఆకాంక్షించారు.
అపురూప దృశ్యమాలిక..
RSS Shakha Sangamam in Kashibugga : కాశిబుగ్గ నగర్ లోని వివిధ ప్రాంతాల నుంచి స్వయంసేవకులు తరలివచ్చి సమిష్టిగా ప్రార్థన చేయడం మైదానంలో ఒక ఆధ్యాత్మిక, దేశభక్తి పూరిత వాతావరణాన్ని సృష్టించింది. “హిందువులం ప్రియ బంధువులం – సుగుణ సింధు జల బిందువులం” అనే నినాదంతో కార్యక్రమం మార్మోగింది. ఈ కార్యక్రమంలో కాశిబుగ్గ నగర సంఘచాలక్ శ్రీ చామర్తి ప్రభాకర్ గారు, సంఘ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో స్వయంసేవకులు, హిందూ బంధువులు పాల్గొన్నారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

