Telangana

Power Outage | ప్ర‌భుత్వ‌ ఆస్పత్రుల్లో కరెంట్ కోతలు.. అవ‌స్థ‌లు ప‌డుతున్న సిబ్బంది, రోగులు

Spread the love

నివేదిక కోరిన తెలంగాణ ప్రభుత్వం

Power Outage in telangana | గత రెండు రోజుల్లో సూపర్ స్పెషాలిటీతో సహా రెండు ప్రభుత్వ ఆసుపత్రులకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతోంది. బుధవారం, మే 22, రాత్రి, భువనగిరి ప్రభుత్వ ఆస్ప‌త్రిలో వైద్యులు రోగుల‌కు చికిత్స అందించేందుకు మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్‌లను ఉపయోగించడం కనిపించింది. అలాగే మంగళవారం రాత్రి వరంగల్‌లోని ఎంజీఎం సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.IV ఫ్లూయిడ్స్‌పై ఉంచాల్సిన రోగులు ఇబ్బందులుప‌డ్డారు. సాయంత్రం 4.30 గంటల నుంచి ఐదు గంటలపాటు విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిచిపోయింది. దీంతో బెడ్‌లు సిద్ధం కాకపోవడంతో, వారు IV ఫ్లూయిడ్ బాటిళ్లను పట్టుకుని బయట వార్డుల్లో కనిపించారు.

వేసవి ఉక్క‌పోత‌ను భ‌రించ‌లేక చాలా మంది రోగులు వార్డుల నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. రాత్రి 9.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్‌ఎస్ నేత‌లు నిప్పులు చెరిగారు విద్యుత్ అంతరాయానికి ప్రభుత్వమే కారణమని మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్ రావు విమర్శించారు. ‘‘రాష్ట్రంలో కరెంటు కోతలకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో ఐదు గంటల పాటు కరెంటు లేక ట్రీట్ మెంట్ నిలిచిపోయింది. భువనగిరి  ప్రభుత్వాసుపత్రిలో కరెంటు కోతలు రోగులకు నరకప్రాయంగా మారాయి” అని ఎక్స్‌లో పేర్కొన్నారు.
“కాంగ్రెస్ పాలనలో ఈ విద్యుత్ కోతల వల్ల రైతులతో సహా అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులు సైతం తీవ్ర ఇక్క‌ట్లు పడుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం ఇదేనా” అని హ‌రీష్ రావు ప్రశ్నించారు. ‘‘రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని చెబుతున్న నేతలు కళ్లు తెరవండి. రాజకీయాలు పక్కనపెట్టి పరిపాలనపై దృష్టి పెట్టండి’’ అని అన్నారు.

ఆరోగ్య శాఖ వివ‌ర‌ణ ఇదీ..

మెయిన్ హెచ్ టీ లైన్లు, MGM విద్యుత్ లైన్ల మధ్య VCB (వాక్యూమ్ సర్క్యూట్ బ్రేకర్) సమస్యల కారణంగా MGM ఆసుపత్రికి మే 21 సాయంత్రం 6.15 నుండి విద్యుత్ సరఫరాలో అంతరాయం (Power Outage ) ఏర్పడిందని ఆరోగ్య శాఖ నివేదించింది. అయినప్పటికీ, ఆసుపత్రిలోని బ్యాక్-అప్ జనరేటర్లు అత్యవసర, ICU, ఆపరేషన్ థియేటర్‌లు, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లు, వార్డులతో సహా క్లిష్టమైన రోగుల సంరక్షణ ప్రాంతాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను అందిస్తాయి. “డయాలసిస్ విభాగంలోని రోగులు బ్యాటరీ బ్యాకప్ ద్వారా వారి చికిత్సను కొనసాగించారు. NPDCL ఇంజినీరింగ్ విభాగం ద్వారా HT లైన్లు, బ్రేకర్ల మరమ్మత్తు చేసి MGM ఆసుపత్రికి రాత్రి 9 గంటలకు పూర్తి విద్యుత్ సరఫరా పునరుద్ధరించింది. ”అని హెల్త్‌ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సి దామోదర రాజనర్సింహ మే 22 ఉదయం 11 గంటలకు పరిస్థితిని సమీక్షించారు. ఏవైనా లోపాలుంటే 24 గంటల్లోగా విచారణ చేప‌ట్టి నివేదిక సమర్పించాలని తెలంగాణ మెడికల్ సర్వీసెస్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. దీంతోపాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను యుద్ధ ప్రాతిపదికన తనిఖీ చేసేందుకు ఇంజినీర్లను నియమించాలని, వారంలోగా నివేదిక సమర్పించాలని మేనేజింగ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. ఇంజ‌నీర్ల బృందం బ్యాకప్ పవర్ సిస్టమ్‌ల పనితీరును అంచనా వేసి, పనిచేయని జనరేటర్ సిస్టమ్‌లను రిపేర్ చేస్తారు.. లేదా కొత్త వాటితో భర్తీ చేస్తారని ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

 


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *