బెంగాల్లో ‘మహా జంగల్ రాజ్’.. చొరబాటుదారులకు టీఎంసీ కొమ్ముకాస్తోంది: PM Modi
మమతా ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు!
Narendra Modi Cooch Behar Speech 2026 : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహార్లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వానికి కౌంట్డౌన్ ప్రారంభమైందని, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలనకు మే 4న ప్రజలు చరమగీతం పాడుతారని ఆయన జోస్యం చెప్పారు.
పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కౌంట్డౌన్ ప్రారంభమైందని, రాష్ట్రంలో చొరబాటుదారులకు ఆమె పార్టీ కొమ్ముకాస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. మాల్దా, సందేశ్ఖాలి ఘటనలకు కూడా టీఎంసీనే కారణమని ఆయన విమర్శిచారు. రాష్ట్రంలో నెలకొన్న ‘మహా జంగల్ రాజ్’కు ఆ పార్టీయే బాధ్యత వహించాలని ఆయన ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాల్సి వస్తోందని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రజలను టీఎంసీ ‘దోచుకుంటోందని’ ఆరోపించారు, కానీ మే 4న ఫలితాలు వెలువడ్డాక వారు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు.
టీఎంసీ గూండాల బెదిరింపులు!
“ఒకవైపు, మారుతున్న జనాభా కారణంగా సొంత భూమిపై స్వేచ్ఛను కోల్పోతామనే భయం ఉంది,” అని ప్రధాని మోదీ అన్నారు. “మరోవైపు, సొంత గడ్డపై గర్వంగా తల ఎత్తుకుని జీవించాలనే అచంచలమైన విశ్వాసాన్ని నింపే బీజేపీ ఉంది. ఒకవైపు సిండికేట్ పాలనలో ఆస్తిని కోల్పోతామనే భయం ఉంటే, మరోవైపు తలదాచుకోవడానికి పటిష్టమైన గూడు, భూమిపై యాజమాన్య హక్కులు ఉంటాయనే నమ్మకం ఉంది.” పోలింగ్ రోజున టీఎంసీ ‘గూండాల’ బెదిరింపులకు ప్రజలు భయపడవద్దని, చట్టాన్ని విశ్వసించాలని ప్రధానమంత్రి కోరారు. మే 4న టీఎంసీ పాలన ముగియగానే, టీఎంసీ ‘గూండాలు’, దాని సిండికేట్లపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.
మహిళా సంక్షేమం – లక్షాధికారి దీదీలు
లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న తమ ప్రభుత్వ నిర్ణయం గురించి మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) మహిళలకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించిందని, మూడు కోట్ల మంది మహిళలను ‘లక్షాధికారి దీదీలు’గా మార్చిందని ప్రధాని మోదీ అన్నారు. జనాభా నియంత్రణలో బాగా రాణించిన రాష్ట్రాల లోక్సభ ప్రాతినిధ్యానికి ఎలాంటి ఆటంకం కలగదని కూడా ఆయన హామీ ఇచ్చారు.
PM Modi : రాష్ట్రాలకు భరోసా..
ప్రభుత్వం ఏప్రిల్ 16, 17, 18 తేదీలలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మన తల్లులు, సోదరీమణుల ఈ హక్కు 40 ఏళ్లుగా పెండింగ్లో ఉంది. ఇంక ఏమాత్రం ఆలస్యం చేయడం సరికాదు. జనాభా నియంత్రణలో మంచి పని చేసిన రాష్ట్రాలు సీట్ల విషయంలో ఎలాంటి నష్టాన్ని ఎదుర్కోవని కూచ్ బెహార్ నుండి దేశంలోని అన్ని రాష్ట్రాలకు నేను మరోసారి హామీ ఇస్తున్నాను. అందరూ లబ్ధి పొందుతారు,” అని ఆయన అన్నారు.
తన ప్రసంగంలో ప్రధాని మోదీ, చొరబాటుదారులను కాపాడటానికి చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) డ్రైవ్ను టీఎంసీ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. రాబోయే ఎన్నికలు పశ్చిమ బెంగాల్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని, అందుకే ప్రజలు బీజేపీకి ఓటు వేయాలని ఆయన కోరారు. భారత ఎన్నికల సంఘం (ECI)పై ఆయనకు పూర్తి విశ్వాసం ఉందని, 2026 ఎన్నికలు ‘స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా’ జరుగుతాయని కూడా ఆయన అన్నారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

