
- అశ్వినీ వైష్ణవ్ పర్యటనతో మళ్లీ చర్చలోకి వచ్చిన కాజీపేట యూనిట్
- మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు
Kazipet | సుమారు 40 ఏళ్లుగా వరంగల్ జిల్లాలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్ ఉందని, నేడు ఆ కల నెరవేరబోతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో కూడా ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం ప్రయత్నాలు జరిగాయని, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత, కాజీపేటలో రైల్వే ఇంజన్లు, కోచ్లు, వ్యాగన్లు తయారీకి పరిశ్రమ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని తీసుకుని మంజూరు చేశారని ఆయన గుర్తుచేశారు. కాజీపేటలోని రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (Kazipet Railway Coach Factory )పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు.
ప్రధాని మోదీ స్వయంగా ఇక్కడికి వచ్చి భూమిపూజ చేశారని, ఈ యూనిట్ ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు, అలాగే పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తాయని తెలిపారు. నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తారనడానికి ఇది మరో సాక్ష్యం. తెలంగాణలో మొత్తం 40 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోంది. వరంగల్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా అందులో భాగమేనని చెప్పారు.
వరంగల్లో రింగ్రోడ్లో 50 శాతం పనులను కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. టెక్స్టైల్ ఇండస్ట్రీని మంజూరు చేసింది. వెయ్యి స్తంభాల గుడిలో మంటపాన్ని పునరుద్ధరించడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వరంగల్లో ఎయిర్పోర్ట్ అవసరం ఎంతో ఉందని నేను గత బీఆర్ఎస్ పాలన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి అనేకసార్లు లిఖితపూర్వకంగా విన్నవించాను. ఇప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇదే విషయంపై విన్నవించాను. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమిని సేకరించి సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి అప్పగిస్తే, వరంగల్ ప్రజలకు విమాన రాకపోకల సౌకర్యం కలుగుతుంది.
ప్రధాని మోదీ గారు తెలంగాణకు ఏం ఇచ్చారు? బిజెపి ఏం తెచ్చింది? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారు తమ కళ్లు తెరిచి చూడాలి, చెవులుంటే వినాలి. మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా చూడాలని నేను కోరుతున్నా. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గారు స్వయంగా కాజీపేటకు వచ్చి రైల్వే మాన్యుఫాక్చరింగ్ పనులను పర్యవేక్షించడం.. ఆయన రైల్వేల అభివృద్ధిపై చూపుతున్న నిబద్ధతకు నిదర్శనం. వందేభారత్ రైళ్లు, రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వేల విస్తరణ.. వివిధ అభివృద్ధి కార్యక్రమాలతో అశ్వినీ వైష్ణవ్ గారు తెలంగాణ రైల్వేల ముఖచిత్రాన్ని మారుస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.