Tirupati Laddu Row | కలియుగ వైకుంఠంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయింది. ఆలయానికి నెయ్యి సరఫరా చేసిన కంపెనీకి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం నోటీసులు జారీ చేసింది. సదరు కంపెనీ సరఫరా చేసిన నెయ్యి నాణ్యత పరీక్షల్లో విఫలం కావడంతో షోకాజ్ నోటీసులిచ్చింది. నాలుగు కంపెనీల నుంచి నెయ్యి నమూనాలను కేంద్రం సేకరించి ల్యాబ్కు పంపించగా అందులో ఓ కంపెనీ నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ కావడంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. అయితే, తమిళనాడులో ఏఆర్ డెయిరీకి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది.
గత ప్రభుత్వ హయాంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్లో వెల్లడయిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. లడ్డూల (Tirupati Laddu) వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ మధ్య నిప్పు రాజుకుంది. కల్తీ నెయ్యిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఐజీపీ, అత్యకంటే ఎక్కువ ర్యాంకు అధికారులతో సిట్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. సిట్ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందిస్తుందని, ఆ తర్వాత గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..


