
Kanwar Yatra 2025 : హైందవ సంప్రదాయంలో విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో దక్షిణ భారతంలో వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతం వంటి వ్రతాలను జరుపుకుంటుంటారు. అయితే ఉత్తర భారతంలో శ్రావణమాసంలో శివుని ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ ఏడాది జూలై 11 నుంచి ఉత్తరాదిన శ్రావణ మాసం ప్రారంభమవుతోంది. వారికి శ్రావణ మాసం ఆగస్టు 09 తో ముగుస్తుంది. ఈ క్రమంలోనే భక్తులు కన్వర్ యాత్ర చేపడతారు.
శ్రావణ మాసంలో శివ భక్తులు సుదూర తీరాలలో ఉన్న గంగానది నుంచి కావిడులతో నీటిని తీసుకొచ్చి తమ ప్రాంతాలలో ఉన్న శివలింగానికి జలాభిషేకం చేస్తే తమ మొక్కులు నెరవేరుతాయని నమ్ముతారు ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున శివాలయాల్లో శివలింగానికి ఈ జలాభిషేకం చేస్తారు.
కాగా రాబోయే కన్వర్ యాత్ర 2025 (Kanwar Yatra 2025 ) కోసం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ సజావుగా సాగేందుకు మూడు సూపర్ జోన్లు, ఏడు జోన్లు ఉంటాయని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అజయ్ పాల్ శర్మ పేర్కొన్నారు.
“రాబోయే కన్వర్ యాత్ర జూలై 11న ప్రారంభమవుతుంది. ఈ విషయంలో, మేము ఈ ప్రాంతాన్ని మూడు సూపర్జోన్లుగా, ఏడు జోన్లుగా విభజించాం, ఆపై సెక్టార్లుగా విభజించాము… కన్వరియాలకు భద్రత కల్పించడం, వారు సజావుగా పాదయాత్ర చేపట్టడం కోసం ట్రాఫిక్ మార్గాలను క్లియర్ చేయనున్నామని తెలిపారు.
Kanwar Yatra 2025 : ఆహార భద్రత కోసం క్యూఆర్ కోడ్లు
కాగా కన్వర్ మార్గంలోని ఫుడ్ స్టాల్స్, ధాబాలలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి యుపి అధికార యంత్రాంగం QR కోడ్లను ప్రారంభించింది. భద్రతా డ్రైవ్లో భాగంగా, ఆహార, లాజిస్టిక్స్ విభాగం లక్నోలోని ఫైజాబాద్ రోడ్ మార్గంలో అనేక దుకాణాలు, ఆహార దుకాణాలను తనిఖీ చేసింది. అధికారులు గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను అక్కడికక్కడే ధ్వంసం చేశారు. నాణ్యత లేని వస్తువులను విక్రయించవద్దని విక్రేతలను హెచ్చరించారు. యాత్రికులు ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ ఉపయోగించి కోడ్లను స్కాన్ చేసి, ఆహార నాణ్యతపై అభిప్రాయాన్ని ఇవ్వాలని సూచించారు.
మరోవైపు అయోధ్యలోని దేవాలయాలలో ‘జలాభిషేకం’ నిర్వహించడానికి పెద్ద సంఖ్యలో కన్వారియాలు లక్నోలోని ఫైజాబాద్ రోడ్డు గుండా ప్రయాణిస్తారు, ఈ మార్గం యాత్ర సమయంలో అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. ఈ నేపథ్యంలో, అధికారులు కఠినమైన ఆహార భద్రతా చర్యలను అమలు చేశారు.
అధికారుల ప్రకారం, కన్వర్ యాత్ర మార్గంలో పనిచేసే ప్రతి ఆహార దుకాణం చెల్లుబాటు అయ్యే లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కలిగి ఉండేలా చూసుకోవాలని ప్రభుత్వం అన్ని జిల్లాలను ఆదేశించింది. ఈ దుకాణాలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఆహార భద్రత ప్రదర్శన (FSD) బోర్డులను ప్రజలకు కనిపించేలా ప్రముఖంగా ప్రదర్శించాలని ఆదేశించబడ్డాయి. “భక్తులకు ఎటువంటి హానికరమైన ఉత్పత్తులు అందించబడకుండా చూసుకోవడానికి తనిఖీల సమయంలో దొరికిన గడువు ముగిసిన, కల్తీ ఆహార పదార్థాలను వెంటనే ధ్వంసం చేసాము” అని అధికారి తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.