
ASW-SWC సిరీస్లోని మొదటి నౌక ప్రత్యేకతలు ఇవే..
భారతదేశ తీరప్రాంత రక్షణ సామర్థ్యాలను భారీగా పెంచే ప్రయత్నంలో, భారత నావికాదళం (Indian navy) బుధవారం అధికారికంగా యాంటీ-సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ (ASW-SWC) సిరీస్లోని మొదటి నౌక అయిన INS అర్నాలా (INS Arnala) ను ప్రారంభించింది. ఈస్ట్ నేవీ కమాండ్ పరిధిలోని విశాఖపట్నంలోని నావల్ డాక్యార్డ్లో, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో ప్రవేశ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి తూర్పు నావికాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ఆతిథ్యం ఇచ్చారు. సీనియర్ నేవీ అధికారులు, మునుపటి INS అర్నాలా మాజీ కమాండింగ్ అధికారులు, గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ & ఇంజనీర్స్ (GRSE), లార్సెన్ & టూబ్రో షిప్బిల్డింగ్ నుండి ముఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
INS అర్నాలా విశేషాలు..
తీరప్రాంత, నిస్సార జలాల్లో నీటి అడుగున ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడానికి భారత నావికాదళానికి ఇది ఎంతో దోహదపడుతుందని ఇండియన్ నేవీ ఒక ప్రకటనలో పేర్కొంది. నిస్సార జలాల్లో శత్రు జలాంతర్గాములను గుర్తించి, ట్రాక్ చేసి తీర భద్రతను పరిరక్షిస్తుంది. మహారాష్ట్రలోని వాసాయిలో ఉన్న చారిత్రాత్మక అర్నాలా కోట పేరు దీనికి పెట్టారు.
INS అర్నాలా (INS Arnala) లో ఉపరితల నిఘా, ఇంటర్డిక్షన్ ఉన్నాయి. 77 మీటర్ల పొడవు, 1,490 టన్నులకు పైగా బరువు కలిగిన INS అర్నాలా, నిస్సార జలాల్లో అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది. ప్రత్యేకమైన డీజిల్ ఇంజిన్-వాటర్జెట్ ప్రొపల్షన్ సిస్టమ్తో నడిచే అతిపెద్ద భారతీయ నావికాదళ యుద్ధనౌకగా గుర్తింపు పొందింది.
ఆత్మనిర్భర్ భారత్కు నిదర్శనం
ఐఎన్ఎస్ అర్నాలా నౌకను ప్రారంభించడం భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా, పూర్తిగా స్వదేశంలోనే డిజైన్ చేసి నిర్మించారు. భారతదేశం మరింత స్వావలంబన దిశగా తన సముద్ర ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందున, ఐఎన్ఎస్ అర్నాలా జాతీయ బలం, పారిశ్రామిక భాగస్వామ్యం, నావికా నైపుణ్యానికి గర్వకారణంగా నిలుస్తుంది.
కాగా, భౌగోళిక రాజకీయ వాతావరణంలో ప్రస్తుత మార్పుల దృష్ట్యా ఇండియన్ నేవీ అప్రమత్తంగా ఉండాలని సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్ వెల్లడించారు. సవాళ్లతో కూడిన భద్రతా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అత్యాధునిక నౌకలతో మనం సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.