
Delhi Blast | ఢిల్లీలో భారీ పేలుడు: ఎర్రకోట మెట్రో సమీపంలో 8 మంది మృతి – రాజధానిలో రెడ్ అలర్ట్
Delhi Blast | న్యూదిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి భయాందోళనకు గురైంది. సోమవారం సాయంత్రం ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ 1 సమీపంలో కారులో జరిగిన భారీ పేలుడు సంభవించి పది మంది అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదంలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పేలుడు తర్వాత రాజధానిలో హై అలర్ట్ ప్రకటించి, భద్రతా దళాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు. గాయపడిన వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ (LNJP) ఆసుపత్రికి తరలించారు.
దర్యాప్తు వేగవంతం – ఫోరెన్సిక్ బృందాలు రంగంలోకి
సాయంత్రం 6 గంటల సమయంలో ఢిల్లీ అగ్నిమాపక శాఖకు పేలుడు సమాచారం అందింది. వెంటనే ఏడు అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి.
ఒక అధికారి తెలిపిన ప్రకారం “ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించడంతో మూడు నుంచి నాలుగు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి,” అని పేర్కొన్నారు.
పేలుడు అనంతరం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG), ఫోరెన్సిక్ నిపుణులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం రోడ్డుపై నిలిపి ఉన్న కారులోనే పేలుడు సంభవించిందని, సమీపంలోని వాహనాలు మంటల్లో చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు. పేలుడు ఉగ్రవాద కోణమా లేదా ప్రమాదమా అనేది తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో ముమ్మరంగా విచారణ జరుగుతోంది.
ఢిల్లీ, యూపీలో హై అలర్ట్
పేలుళ్ల అనంతరం ఢిల్లీ మొత్తం ప్రాంతంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎర్రకోట, ఇండియా గేట్, పార్లమెంట్ హౌస్ పరిసరాల్లో భద్రతను మరింత బలోపేతం చేశారు. ముఖ్యమైన మెట్రో స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పోలీసులు గట్టి తనిఖీలు నిర్వహిస్తున్నారు.




