భద్రాద్రిలో అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణం (Bhadrachalam)
Bhadrachalam Sitarama Kalyanam 2026 : భద్రాద్రి క్షేత్రంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని లోకకల్యాణార్థం జరిగిన సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా ముగిసింది. మిథిలా స్టేడియంలో వేలాది మంది భక్తుల జయజయధ్వానాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
ప్రభుత్వం తరపున పట్టువస్త్రాల సమర్పణ
రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న సీఎం, రూ. 351 కోట్లతో చేపట్టనున్న ఆలయ అభివృద్ధి తొలి దశ పనులకు భూమి పూజ నిర్వహించారు.
Bhadrachalam : ఆధ్యాత్మిక శోభతో మిథిలా స్టేడియం
శ్రీరామచంద్రస్వామి, సీతమ్మ వారి వివాహ తంతు శాస్త్రోక్తంగా కొనసాగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన కళ్యాణ మండపం ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించింది. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో భద్రాచలం క్షేత్రం కిక్కిరిసిపోయింది.
పకడ్బందీగా ఏర్పాట్లు
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తాగునీరు, అన్న ప్రసాదం, మజ్జిగ పంపిణీ, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ రోహిత్ రాజ్ ఆధ్వర్యంలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కల్యాణాన్ని వీక్షించారు.
ఈ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, కొండా సురేఖ, ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

