
Ayodhya Economy Case Study | భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు.. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆ పుణ్యక్షేత్రం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కేవలం భక్తి భావానికే పరిమితమవకుండా, అయోధ్య ఇప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తోంది. ఐఐఎం (IIM) లక్నో ఇటీవల నిర్వహించిన అధ్యయనం ప్రకారం, రామాలయం ఇప్పుడు ఒక శక్తివంతమైన ‘ఎకనామిక్ ఇంజిన్ గా అవతరించింది.
పర్యాటక విస్ఫోటనం – ఆదాయ వర్షం
రామాలయ ప్రతిష్టకు ముందు, అయోధ్య ప్రధానంగా పవిత్ర తీర్థయాత్రా స్థలంగా గుర్తించేవారు. పర్యాటకుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. ఉపాధి అవకాశాలు కూడా తక్కువగా ఉండేవి. ఆర్థిక కార్యకలాపాలు సైతం అంతంతమాత్రమే.. ఇక రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాల వృద్ధి అంతగా లేదు. ఇక బాలరాముడి ప్రతిష్ఠ తర్వాత, అయోధ్యలో ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పెరిగాయి. సగటున, ప్రతిరోజూ 200,000 కంటే ఎక్కువ మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తున్నారు. దీంతో పర్యాటకం, హోటల్, రవాణా, నిర్మాణం, సేవా రంగాలలో భారీగా వేగం పుంజుకుంది. పర్యాటకులు లక్షల సంఖ్యలో వస్తుండడంతో ఆదాయ వృద్ధి తోపాటు పర్యాటక సంబంధిత కార్యకలాపాలు పన్ను ఆదాయంలో గణనీయంగా పెరిగింది. ఇది ₹20,000-25,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా.
ఆతిథ్య రంగంలో ‘అయోధ్య’ మార్క్
పర్యాటకుల రాకతో హోటల్ పరిశ్రమ అనూహ్య వృద్ధిని సాధించింది అయోధ్యలో 150కి పైగా కొత్త హోటళ్లు, హోమ్స్టేలు అందుబాటులోకి వచ్చాయి. ప్రముఖ గ్లోబల్ హోటల్ చైన్స్ తమ బ్రాంచ్లను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయి. ఆన్లైన్ బుకింగ్లలో ఏకంగా 400% (4 రెట్లు) వృద్ధి నమోదైంది.
MSME రంగంలో పెరిగిన పెట్టుబడులు
స్థానిక యువతకు, వ్యాపారులకు రామాలయం కల్పవృక్షంగా మారింది. సుమారు 6,000 కొత్త చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEలు) ప్రారంభమయ్యాయి. వచ్చే 4-5 ఏళ్లలో పర్యాటక, రవాణా రంగాల్లో 1.2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. స్థానిక హస్తకళలు, శిల్పాలు, సావనీర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది.
సామాన్యుడి ఆదాయంలో పెను మార్పు
పెద్ద వ్యాపారస్తులే కాకుండా, వీధి వ్యాపారులు, చిన్న దుకాణదారుల బతుకులు కూడా మారాయి. గతంలో నామమాత్రంగా ఉన్న వారి ఆదాయం, ఇప్పుడు రోజుకు ₹2,500 వరకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యాపారుల ఆదాయం ఏకంగా 5 రెట్లు పెరగడం గమనార్హం.
రియల్ ఎస్టేట్ బూమ్
అయోధ్య ఇప్పుడు పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారింది. భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి (విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఆధునీకరణ) రియల్ ఎస్టేట్ రంగానికి మరింత బలాన్ని ఇచ్చింది.
ఐఐఎం లక్నో చేసిన ఈ అధ్యయనం రామాలయం ఇప్పుడు అయోధ్యకు ఒక ప్రధాన “ఆర్థిక ఇంజిన్”గా మారిందని స్పష్టంగా చూపిస్తుంది. విశ్వాసం, అభివృద్ధి కలిసి నడిచే “దేవాలయ ఆర్థిక వ్యవస్థ”కి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. అయోధ్య ఇకపై కేవలం మతపరమైన నగరం కాదు, ఆర్థిక అభివృద్ధికి కొత్త కేంద్రం.

