Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?
Kanwar Yatra Rules 2024 | ఎంతో భక్తిశ్రద్ధలతో శివభక్తులు నిర్వహించే ‘కన్వర్ యాత్ర’కు అంతా సిద్ధమైంది. జూలై 22 నుంచి ఆగస్టు 2వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘కన్వర్ యాత్ర’ మార్గాల్లో ఉన్న అన్ని తినుబండారాల షాపులకు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ అన్ని టీ స్టాళ్లు, ధాబాలు, తోపుడు బండ్లకు కూడా వర్తించనుంది. అయితే కన్వర్ యాత్రికుల పవిత్రతను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో లక్షలాది మంది శివ భక్తులు తమ స్థానిక దేవాలయాలలో సమర్పించడానికి పవిత్ర గంగాజలాన్ని సేకరించేందుకు కుండలను మోసుకుంటూ కాలినడకన నడుస్తారు. ఈ సమయంలో వారు నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ కు దూరంగా ఉంటారు. అలాగే ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని కూడా తీసుకోరు.
ఉత్తరాఖండ్లో, హరిద్వార్ పోలీసు ఎస్ఎస్పి ప్రమోద్ సింగ్ దోభాల్ మాట్లాడుతూ, “హోటళ్లు, ధాబాలు లేదా స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ను నడుపుతున్న వారందరూ తమ యజమానుల పేర్లు, క్యూఆర్ కోడ్లు, మొబైల్ నంబర్లను ప్రదర్శించాలని ఆదేశించారు.” పాటించని వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారి స్టాల్స్ను కన్వర్ యాత్ర మార్గాల నుంచి తొలగిస్తామని ఆయన హెచ్చరించారు.
నిబంధనలు ఏమిటి?
Kanwar Yatra Rules ముజఫర్నగర్ పోలీసులు జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. నేమ్ డిస్ప్లే ఆర్డర్, అన్ని తినుబండారాలు, ధాబాలు, హోటళ్లు, పండ్ల విక్రయదారులు తప్పనిసరిగా తమ యజమానుల పేర్లను పెద్ద అక్షరాలతో ప్రదర్శించాలి. తద్వారా కన్వర్ భక్తులు తమ రిఫ్రెష్మెంట్లను ఎక్కడ పొందాలో నిర్ణయించుకోవచ్చు. కన్వర్ యాత్ర మార్గంలో దాదాపు 240 కి.మీ ముజఫర్ నగర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. కన్వర్ యాత్రకు కాలినడకన వెళ్లే భక్తులు సాధారణంగా భోజనం చేయడానికి ఆగుతారు. వారు తినుబండారాల గురించి వారి మనసులో ఉన్న ఆందోళనలు, అనుమానాలను తొలగించడానికి ఈ నిబంధనలు సహాయపడతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
ఈ నిబంధనలు ఇందుకే..
సహరాన్పూర్ డివిజనల్ పోలీస్ డిఐజి అజయ్ కుమార్ సాహ్ని మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం కన్వర్ యాత్రలో తినుబండారాల యజమాని ముస్లిం అని భక్తులు గుర్తించినప్పుడు గొడవలు జరుగుతుంటాయి. “అన్ని గొడవలను తొలగించేందుకే ఈ ఉత్తర్వు జారీ చేశాం” అని చెప్పారు.
బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది మాట్లాడుతూ, ఇలాంటి ఆర్డర్పై ఎలాంటి అభ్యంతరం ఉండదని, వినియోగదారుల ప్రయోజనాల కోసం తినుబండారాల యజమానులు తమ పేర్లను దాచకూడదని అన్నారు. కన్వర్ యాత్ర సందర్భంగా యూపీ, ఉత్తరాఖండ్ పోలీసులు ఎందుకు ఇలాంటి ఆదేశాలు జారీ చేశారో అర్థం చేసుకోవాలి. పవిత్రమైన శ్రావణ మాసంలో, లక్షలాది మంది శివ భక్తులు నాన్ వెజ్ ఫుడ్ అమ్మే తినుబండారాలకు దూరంగా ఉంటారు. అది వారి యాత్రను, పవిత్రతను అపవిత్రం చేస్తుందని భక్తులు భావిస్తారు. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, కన్వర్ యాత్రల సమయంలో, తినుబండారం యజమాని ముస్లిం అని కస్టమర్ అయిన శివభక్తుడు గుర్తించినప్పుడు తరచుగా గొడవలు జరుగుతున్నాయి. అతను వందల మైళ్ళు కాలినడకన నడుస్తున్నాడు. పోలీసుల ఉద్దేశాన్ని ఎవరూ అనుమానించకూడదు. అని పేర్కొన్నారు.
తినుబండారాల యజమానులు తమ పేర్లను బోల్డ్ అక్షరాలతో ప్రదర్శిస్తే గొడవలను సులువుగా నివారించవచ్చని, తద్వారా భక్తుడు ఎక్కడ తినాలి, ఏ తినుబండారానికి దూరంగా ఉండాలనే దానిపై పూర్తి స్పష్టతతో ఎంపిక చేసుకోవచ్చని పోలీసు అధికారులు చెబుతున్నారు. ముస్లిం దుకాణదారుల సమస్య ఏమిటంటే, వారి పేర్లు ప్రముఖంగా ప్రదర్శించకపోతే వేలాది మంది భక్తులు తమ టీ స్టాల్స్, తినుబండారాలకు దూరంగా ఉంటే, వారి సంపాదన దెబ్బతింటుందని భావిస్తారు. కన్వర్ యాత్ర ముగిసే వరకు యజమానుల పేర్ల ప్రదర్శనకు సంబంధించిన ఈ ఆర్డర్ అమలులో ఉంటుందని యుపి పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కాగా యూపీ ప్రభుత్వ ఉత్తర్వులను సమాజ్వాదీ పార్టీ, బీఎస్పీ, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్, జమియత్ ఉలామా-ఏ-హింద్ వ్యతిరేకించాయి. బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తత సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని జమియత్ రాష్ట్ర చీఫ్ మౌలానా ఖారీ జాకీర్ ఆరోపించారు. యుపిలో శతాబ్దాలుగా కన్వర్ యాత్రలు కొనసాగుతున్నాయని, తినుబండారాల కోసం ఇలాంటి ఉత్తర్వులు ఏ ప్రభుత్వం జారీ చేయలేదని అన్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..