
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోసం భారీ ఏర్పాట్లు!
Vemulawada Mahashivaratri 2026 | దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం మహాశివరాత్రి ఉత్సవాలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శనివారం నుంచి ఈ నెల 16 వరకు నిర్వహించే ఈ మహా జాతర కోసం దేవస్థానానికి సంబంధించి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది.
జాతర విశేషాలు & భక్తుల సౌకర్యాలు :
స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు: వేములవాడ ప్రధాన ఆలయంలో ధర్మగుండం ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో, భక్తుల కోసం పార్కింగ్ ప్రదేశంలో 400 షవర్ నల్లాలు ఏర్పాటు చేశారు. దుస్తులు మార్చుకోవడానికి తాత్కాలిక గదులను సైతం నిర్మించారు.
దర్శన ఏర్పాట్లు: భక్తులు రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని, తలనీలాలు సమర్పించి, తమ మొక్కులైన కోడె మొక్కు, ఎత్తు బెల్లం పంపిణీ, బద్దిపోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించేందుకు వీలుగా ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు.
చలువ పందిళ్లు & ఆహారం: సుమారు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో చలువ పందిళ్లు వేశారు. క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, మజ్జిగతో పాటు అల్పాహారం (ఉప్మా, పులిహోర) పంపిణీ చేయనున్నారు.
మద్యం విక్రయాలు బంద్: జాతర పవిత్రతను కాపాడేందుకు వేములవాడ పట్టణంలో 48 గంటల పాటు మద్యం విక్రయాలను నిలిపివేశారు.
రవాణా సౌకర్యాలు
600 ఆర్టీసీ బస్సులు: కరీంనగర్ రీజియన్లోని 14 డిపోల నుంచి 600 బస్సులను నడుపుతున్నారు. తిప్పాపూర్ బస్టాండ్ నుండి ఆలయానికి భక్తులను చేరవేసేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.
వైద్య సేవలు: 24 గంటల పాటు వైద్య సేవలు అందించేందుకు 30 మంది డాక్టర్లు, 130 మంది పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. అత్యవసర సహాయం కోసం అంబులెన్స్లు సిద్ధంగా ఉన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా కోసం 50 మంది సెస్ సిబ్బందిని, అగ్నిప్రమాదాల నివారణకు 5 అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు.
రాజన్న సన్నిధిలో ఏకాంత పూజలు: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి మహాలింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ పూజలు ఏకాంతంగా నిర్వహించనున్నారు. శివదీక్ష స్వాములు తమ దీక్షలను విరమించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

