
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు (N Ramachandra Rao BJP) కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో డాక్టర్ అనూప్ తన బృందంతో బీజేపీలో చేరిన సందర్భంగా రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
“రేవంతుద్దీన్ – అక్బరుద్దీన్” మధ్య పక్కా అండర్స్టాండింగ్!
సీఎం రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ ఓవైసీ ఇద్దరూ స్నేహితులని, బయట మాత్రం నాటకాలు ఆడుతున్నారని రామచంద్రరావు విమర్శించారు. “గతంలో కాంగ్రెస్ ముస్లింల పార్టీ అని రేవంత్ స్వయంగా చెప్పారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే రేవంత్ అక్బరుద్దీన్ చేత తనపై విమర్శలు చేయిస్తున్నారు” అని ఆరోపించారు. హైదరాబాద్లో హైడ్రా (HYDRA) పేరుతో పేదల ఇళ్లను కూల్చుతున్న రేవంత్ ప్రభుత్వం, పాతబస్తీలోని ఓవైసీ కాలేజీని ఎందుకు ముట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇది పక్కా వివక్ష అని మండిపడ్డారు.
బీజేపీ వైపు మేధావుల చూపు
ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలన, పారదర్శకత పట్ల దేశవ్యాప్తంగా నమ్మకం పెరిగిందని, అందుకే తెలంగాణలో మేధావులు, విద్యావంతులు పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని ఆయన వెల్లడించారు. వరుస రాష్ట్రాల్లో బీజేపీ విజయాలు సాధిస్తోందని, అదే సరళి తెలంగాణలో కూడా మొదలైందని ధీమా వ్యక్తం చేశారు.
లిక్కర్ స్కామ్ కేసుపై కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, కవిత డిశ్చార్జ్ పిటిషన్ కేవలం న్యాయపరమైన ప్రక్రియ మాత్రమేనని, అంతమాత్రాన వారు అమాయకులు కాదని రామచంద్రరావు స్పష్టం చేశారు. “వాస్తవాలు లేకపోతే సెల్ఫోన్లు ఎందుకు తగలబెట్టారు? పాలసీని ఎందుకు మార్చుకున్నారు?” అని ఆయన నిలదీశారు.
జాతీయవాద వార్తలు, దేశభక్తి కథనాలు, తాజా టెక్నాలజీ, లైఫ్ స్టైల్ విశేషాల కోసం వందేభారత్ వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండండి. మా తాజా అప్డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే మా సోషల్ మీడియా వేదికలపై కనెక్ట్ అవ్వండి: వాట్సప్ ఛానల్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్)
ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశహితం కోరుకునే మీ స్నేహితులతో ఈ కథనాన్ని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్
