Saturday, March 1Thank you for visiting

Atal Bihari Vajpayee | వాజ్‌పేయి.. సంకీర్ణ‌పాల‌న‌లో సుస్థిర నిర్ణ‌యాలు తీసుకున్న నేత

Spread the love

Vajpayee 100th Birth Anniversary | అటల్ బిహారీ వాజ్‌పేయి.. భారత రాజకీయ చరిత్రలో ఓ అపూర్వ వ్య‌క్తిత్వం గ‌ల నాయ‌కుడు. ఉత్తమ కవి, మేధావి, సమర్థ రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా దేశానికి ఒక దిశ చూపిన‌ నేత‌గా గుర్తింపు పొందారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయ‌న‌ చెర‌గ‌ని ముద్రవేసుకున్నారు. మూడుసార్లు భారత ప్రధానిగా పనిచేసిన వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) దేశాభివృద్ధికి అనేక మైలురాళ్లు వేశారు. అద్భుత సంస్క‌ర‌ణ‌ల‌తో దిశానిర్దేశం చేశారు. సంప్రదాయ విలువలతో కూడిన ప్రజాస్వామ్య ఆలోచనలతో దేశానికి సేవ చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని గ్వాలియ‌ర్ (Gwalior)లో 1924 డిసెంబరు 25న‌ అటల్ బిహారీ వాజ్‌పేయి పుట్టారు. అంటే.. ఆయ‌న జ‌న్మించి నేటికి వందేళ్లు అన్న‌మాట‌. ఈ రోజు ఆయ‌న శ‌త‌జ‌యంతి ఉత్స‌వాలను దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయి.

అంద‌రూ మెచ్చుకొనేలా…

Atal Bihari Vajpayee Birth Anniversary : 1924 డిసెంబ‌రు 25న జ‌న్మించిన వాజ్‌పేయి 2018 ఆగ‌స్టు 16 వ‌ర‌కు జీవించారు. ఆయ‌న‌ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ జీవితంలో అనేక ఆస‌క్తిగ‌ల అంశాలు ఉన్నాయి. ఉన్న‌త విద్యాభ్యాసం చేసిన వాజ్‌పేయి సాహిత్య రంగంలో విశేష గుర్తింపు పొందారు. క‌విగా మంచి పేరును సంపాదించారు. మేరే ఆంగన్ కీ చిడియా, గన్ గుంజేష్‌, అమిత్ మజ్దార్ లాంటి క‌వితా సంకనాలు ప్ర‌సిద్ధి చెందాయి. మృదుస్వభావం, నూటొక్క హాస్యం వాజ్‌పేయి సొంతం. రాజ‌కీయాల్లోనూ అదే స్వ‌భావాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. దీంతో ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా ఆయ‌న్ను ఎంతో అభిమానించేవారు. వాజ్‌పేయికి 2014లో మోదీ ప్ర‌భుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న (Bharat Ratna) ప్రదానం చేసింది. ఆయ‌న జ‌న్మ‌దినాన్ని (డిసెంబర్ 25)ను గుడ్ గవర్నన్స్ డే గా ప్రకటించారు.

రాజకీయ నేత‌గా అట‌ల్ బిహారి వాజ్‌పేయి

డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీతో కలిసి 1951లో భారతీయ జనసంఘ్‌ను వాజ్‌పేయి స్థాపించారు. 1980లో BJP స్థాపనలో కీలక పాత్ర పోషించారు. 1968-1973 కాలంలో భారతీయ జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1977-1979 కాలంలో మోరార్జీ దేశాయ్ కేబినెట్‌లో విదేశాంగ మంత్రిగా సేవలందించారు.
ఆ త‌ర్వాత మూడుసార్లు ప్ర‌ధానిగా కొన‌సాగిన వాజ్‌పేయి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని స‌మ‌ర్థంగా నిర్వ‌ర్తించార‌నే పేరును సంపాదించుకున్నారు. త‌న ప‌దవీ కాలంలో ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో చిర‌స్థాయిగా నిలిచాయి. భారతీయ చారిత్రక సంపదకు ప్రాధాన్యతనిచ్చి, రాజకీయ సభలు, ప్రజా ప్రయోజన యాత్రలు నిర్వహించారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసి దౌత్య సంబంధాల‌ను మెరుగుప‌ర్చారు. ప‌లుమార్లు పాకిస్తాన్‌లో సైతం ప‌ర్య‌టించి అక్క‌డి ప్ర‌ధానుల‌ను క‌లవ‌డం అప్ప‌ట్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌ధానిగా ప్ర‌భావ‌శీల పాత్ర‌

అటల్ బిహారి వాజపేయి మూడు సార్లు భారత ప్రధానిగా పనిచేశారు. మొదట ఆయ‌న నేతృత్వంలో ఏర్పాటైన బీజేపీ ప్ర‌భుత్వం 13 రోజుల‌పాటు కొనసాగింది. ఆ తర్వాత 13 నెలల పాటు అధికారంలో ఉంది. చివరగా 1999 నుంచి 2004 వరకు పూర్తి కాలం ప్రధానిగా వాజ్‌పేయి సేవలందించారు. జాతీయ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఆయ‌న విజయవంతంగా నడిపించారు. వాజ్‌పేయి అమ‌ల్లోకి తెచ్చిన సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రభావశీలతకు గుర్తుగా నిలిచాయి.

  1. టెలికాం రంగంలో విప్లవం
    టెలికాం రంగంలో వాజ్‌పేయి 1999లో విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చారు. BSNL ఆధిపత్యాన్ని తొలగించి కొత్త టెలికాం విధానాన్ని అమలు చేశారు. దీని ద్వారా ప్రజలు తక్కువ ధరలలో ఫోన్ సేవలను పొందగలిగారు.
  2. సర్వ శిక్షా అభియాన్
    విద్యారంగానికి వాజ్‌పేయి ప్రాధాన్యమిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే 2000-01లో సర్వ శిక్షా అభియాన్‌ను ప్రారంభించారు. 6-14 సంవత్సరాల పిల్లలకు ఉచితంగాఆ విద్య అందించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్‌ను అమలు చేశారు.
  3. ఢిల్లీ-లాహోర్ బస్ సర్వీస్
    ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌లోని లాహోర్‌కు 1999లో బస్ సర్వీస్‌ను ప్రారంభించారు. త‌ద్వారా భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్ర‌యత్నించారు. ఆయన స్వయంగా మొదటి బస్సు ప్రయాణంలో లాహోర్ వెళ్లి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను కలిశారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య సాన్నిహిత్యం పెంచింది.
  4. పోఖ్రాన్ అణు పరీక్షలు
    మే 1998లో పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించారు. దేశ భద్రతకు ఇదెంతో ప్రాధాన్యంగా నిలిచింది. 1974 తర్వాత అణు పరీక్షలు చేపట్టిన ప్ర‌ధానిగా వాజ్‌పేయి గుర్తింపు పొందారు.
  5. స్వర్ణ చతుర్భుజం ప్రాజెక్ట్
    దేశాన్ని రోడ్ల ద్వారా కలపడానికి స్వర్ణిమ చతుర్భుజం ప్రాజెక్ట్‌ను అమలు చేశారు. ఇది చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలను అనుసంధానం చేశాయి.
  6. ప్రైవేటీకరణకు ప్రోత్సాహం
    ప్రైవేటీకరణకు వాజ్‌పేయి ద్వారాలు తీశారు. 1999లో డిజింవెస్ట్‌మెంట్ మంత్రిత్వ శాఖను స్థాపించి బాల్కో, హిందుస్థాన్ జింక్ వంటి సంస్థల ప్రైవేటీకరణ ప్రారంభించారు.
  7. పార్లమెంట్‌పై దాడితో పోటా చట్టం
    2001 డిసెంబరు 13న భారత పార్లమెంట్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి వాజ్‌పేయి ప్రభుత్వం ప్రతిస్పందనగా పోటా చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఉగ్రవాద నిరోధానికి కీల‌క‌పాత్ర పోషించింది.
  8. రాజ్యాంగ సమీక్ష కమిటీ
    ఫిబ్రవరి 2000లో రాజ్యాంగ సమీక్షకు జాతీయ కమిటీని ఏర్పాటు చేశారు. ఇది అప్పట్లో వివాదాస్పదమైన చర్యగా నిలిచింది.
  9. కుల గణాంకాలను నిలిపివేత
    1999లో కుల గణాంకాలపై తీసుకున్న నిర్ణయాలను ర‌ద్దు చేశారు. కులాల వారీగా జనగణనను నిలిపివేశారు.
  10. చంద్రయాన్-1 ప్రకటన
    2003లో లాల్‌ఖిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో చంద్రయాన్-1ను ప్రకటించారు. భారత తొలి చంద్ర యాత్ర ప్రారంభానికి నాంది పలికిన వాజ్‌పేయి ISROని ముందుకు నడిపించారు.
  11. కార్గిల్ యుద్ధం (1999)
  12. కార్గిల్ యుద్ధ సమయంలో వాజ్‌పేయి దౌత్యపరంగా, సైనికంగా గట్టి నిర్ణయాలు తీసుకున్నారు. భారత సైన్యానికి అండగా నిలిచి విజయం సాధించారు.
  13. పరిశ్రమలు .. ఆర్థిక సంస్కరణలు
    LIC లాంటి సంస్థల ప్రైవేటీకరణకు బాటలు వేస్తూ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్స‌హిస్తూ భార‌త‌దేశంలో పరిశ్ర‌మ‌ల స్థాప‌న‌ల‌కు విశేష కృషి చేశారు.
  14. వ్యవసాయ అభివృద్ధి అంత్యోదయ అన్నా యోజన పేరుతో దేశంలోని పేదల‌కు సరసమైన ధరకే రేషన్ అందించారు.

వాజ్‌పేయి స్మార‌క ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ

మాజీ ప్రధాని దివంగ‌త‌ అటల్ బిహారీ వాజ్‌పేయి (Vajpayee) శ‌త జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈ రోజు మధ్యప్రదేశ్ (వాజ్‌పేయి జ‌న్మ‌స్థ‌లం)లో పర్యటించారు. వాజ్‌పేయి స్మారకార్థం ఖజురహోలో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. జాతీయ దృక్పథ ప్రణాళిక కింద దేశంలోనే మొట్టమొదటి నదుల అనుసంధానం ప్రాజెక్టు అయిన కెన్-బెత్వా నదిని అనుసంధానించే జాతీయ ప్రాజెక్టుకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.

ఈ ప్రాజెక్ట్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది. తద్వారా లక్షలాది రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రజలకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించనున్నారు. దీనితో పాటు, జలవిద్యుత్ ప్రాజెక్టులు 100 మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీకి దోహదం చేస్తాయ‌ని కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ ప్రాజెక్ట్ అనేక ఉపాధి అవకాశాలను సృష్టించడంతోపాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అంటోంది. అలాగే అటల్ బిహారీ వాజ్‌పేయి శ‌త‌జ‌యంతి స్మారక స్టాంపును, నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. 1153 అటల్ గ్రామ్ సుశాసన్ భవనాలకు శంకుస్థాపన చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version