
TG Ration Cards | రాష్ట్రంలోని తెల్ల రేషన్కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఉగాది నుంచి రేషన్ షాపులలో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారని తెలిపారు. మటంపల్లి ఆలయంలో పంచాంగ శ్రావణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీని చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి శుక్రవారం వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీని మటంపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇందు కోసం స్థలం ఎంపికకు చర్యలు తీసుకున్నామని అన్ని వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
TG Ration Cards : ఒక్కొక్కరికి ఎన్ని కిలోలు?
రాష్ట్రంలోని పేద, దిగువ మధ్య తరగతి వర్గాల కోసం కీలక నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ట్రంలో ఆహార భద్రత కార్డులు (TG Ration Cards) కలిగిన ప్రతి ఒక్కరికీ ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. కుటుంబంలో ఎంత మంది ఉంటే ఒకొక్కరికీ 6 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. అయితే, ప్రస్తుతం పంపిణీ చేస్తున్న దొడ్డు బియ్యం తినడానికి అనువుగా ఉండడం లేదు. అందుకే చాలా మంది రేషన్కార్డుదారుల్లో దాదాపు 85 శాతం మంది దొడ్డు బియ్యాన్ని కిలోకు రూ.10 చొప్పున బహిరంగ మార్కెట్లో అమ్ముకుని, మళ్లీ సన్న బియ్యం కొనుగోలు చేసుకుంటున్నారు. కొందరు అక్రమార్కులు దొడ్డు బియ్యాన్ని మరింతగా పాలిష్ చేసి, సన్న బియ్యంగా మార్చడం ఎక్కువ ధరకు విక్రయిస్తూ దళారులు భారీగా లాభపడుతున్నారు.
దీంతో రేషన్కార్డుదారులకు దొడ్డు బియ్యం బదులుగా సన్న బియ్యం ఇస్తే.. నూటికి నూరు శాతం మంది తినడానికి వినియోగించుకుంటారని ప్రభుత్వం ఆలోచించింది. అది కూడా ఉచితంగా ఇస్తే పేదలకు ఉపయోగకరంగా ఉండడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని భావిస్తోంది. ఈ నిర్ణయంతో బహిరంగ మార్కెట్లో మేలిమి రకం సన్న బియ్యం ధరలు కూడా తగ్గిపోతాయని భావిస్తున్నారు. ప్రస్తుత వానాకాలంలో పండిన సూపర్ ఫైన్ బియ్యాన్నే రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.