Thursday, June 19Thank you for visiting

తెలంగాణ‌ విద్యా వ్యవస్థలో సరికొత్త విధానం.. నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్స్.. విద్యార్థులకు ఉచిత రవాణా

Spread the love

New Education System | హైదరాబాద్ : తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను, విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సరికొత్త విధానంతో ముందుకు సాగాల‌ని విద్యా శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. వచ్చే మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ముఖ్య కారదర్శి బుర్రా వెంకటేశం తోపాటు ఇతర అధికారులకు సీఎం సూచించారు.
ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ కు సమాంతరంగా అన్ని చోట్లా సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లు కొనసాగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారితో కలిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ పై విద్యా శాఖ అధికారులతో జ‌రిగిన‌ సమావేశంలో సీఎం ఈ మేరకు సూచనలు చేశారు.

అంగన్ వాడీలకు సింగిల్ టీచర్

చిన్న పిల్లలకు సొంత గ్రామాల్లోనే సౌకర్యవంతంగా ఉండేలా ప్లే స్కూల్ తరహాలో మూడో తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యాబోధన చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అంగన్ వాడీల (Anganwadi) లో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యాబోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక రూపొందించాలని సీఎం సూచించారు.

రెసిడెన్షియల్స్ కు రవాణా సదుపాయం

మూడో తరగతి వరకు అంగన్ వాడీ ప్లే స్కూల్ లో బోధన తర్వాత విద్యార్థులు నాలుగో తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల‌లో చదువుకునేలా ప్రణాళికలు రూపొందించాల‌ని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. అలాగే ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లివచ్చేందుకు ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

పైలట్ ప్రాజెక్టు

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా ప్లే స్కూల్, సెమీ రెసిడెన్షియల్ విధానాలకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయడానికి ముందే విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకోవాలని విద్యా శాఖను ముఖ్యమంత్రి ఆదేశించారు. విద్యావేత్తల సూచనలను బట్టి ముందుగా ఒకటి రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపట్టేలా ప్రణాళికలు ఉండాలని సీఎం చెప్పారు.
పాఠశాల్లో వసతులు, సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వ నిధులతోపాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ( సీఎస్ఆర్) ఫండ్స్ పైనా దృష్టి సారించాలని అధికారులకు సీఎం సూచించారు. వీటితోపాటు విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version