
Hyderabad | తెలంగాణలో ప్రజల డిమాండ్ కు తగినట్లుగా కొత్త బస్సుల కొనుగోలు (TGSRTC New Buses) కు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. పెరిగిన రవాణా అవసరాలు, నూతన మార్గాలను ప్రతిపాదికగా బస్సుల కొనుగోలుపై నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో టీజీ ఆర్టీసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్షించారు. మహిళలు మహాలక్ష్మి పథకాన్ని వినియోగించుకుంటున్న తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహాలక్ష్మి పథకం అద్భుతంగా అమలవుతోందని.. ఇప్పటివరకు 83.42 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేశారని తెలిపారు. దీనిని బట్టి మహిళా ప్రయాణికులకు రూ.2,840.71 కోట్లు ఆదా అయిందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు.
టిజి ఆర్టీసీలో 7,292 బస్సుల్లో మహాలక్ష్మి పథకం వర్తిస్తోందని మంత్రి పొన్నం వివరించారు. మహాలక్ష్మి పథకం ప్రారంభమైన తర్వాత వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్లోని హాస్పిటల్స్ కు వస్తున్న మహిళల సంఖ్య పెరుగుతున్నదని, ఇందుకు సంబంధించి పలు పత్రికల్లో వచ్చిన కథనాలను ముఖ్యమంత్రికి అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు.
అనంతరం వివిధ బ్యాంకులు, ఉద్యోగుల ఈపీఎఫ్ ఖాతా నుంచి వాడుకున్న నిధులు, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు తదితరాలకు కలిపి మొత్తం రూ.6,322 కోట్ల రుణాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు చెల్లిస్తున్న వడ్డీ రేటు ఎక్కువగా ఉందని.. వడ్డీ రేట్ల తగ్గింపు, అప్పుల రీకన్స్ట్రక్చన్పై స్టడీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్టీసీపై అప్పుల భారాన్ని క్రమంగా తగ్గించాలని సూచించారు. మహాలక్ష్మి పథకంతో ఆక్యుపెన్సీ రేటు పెరగడంతో పాటు ప్రభుత్వం చెల్లిస్తున్న రీయింబర్స్మెంట్తో సంస్థకు లాభాలు చేకూరుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్యమంత్రి కార్యదర్శులు చంద్రశేఖర్రెడ్డి, షానవాజ్ ఖాసీం, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ముఖ్య అధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..