Thursday, June 19Thank you for visiting

Praja Vijayotsavalu | ఈనెల 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాలు 

Spread the love

November 14th Praja Vijayotsavalu | రాష్ట్రంలో  కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నందున ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలపై  ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అధ్యక్షతన శనివారం సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షురాలు అలేఖ్య పుంజాల, ప్రజాకవి జయరాజ్, వివిధ శాఖల కార్యదర్శులు  పాల్గొన్నారు.

సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన

ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ..  ఈ సంవత్సర కాలంలో ఎన్నో విప్లవాత్మక, ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమాలను షో కేస్ చేస్తూ, ప్రభుత్వ విజన్ ను వివరించేలా ఈ కార్యక్రమాలను రూపొందిస్తున్నామని  తెలిపారు. ఈ 26 రోజుల్లో ప్రభుత్వ గ్యారెంటీ పథకాలు.. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఇందిరా మహిళాశక్తి తదితర పథకాలతో పాటు, ప్రభుత్వం అమలుచేస్తున్న అనేక అధివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై చైతన్య పరుస్తామని భట్టి తెలిపారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందని, రూ.18 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ చేయడంతోపాటు మహిళా సంఘాలకు 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను అందించామని చెప్పారు.మూతపడిన కమలాపూర్ రేయాన్స్ పరిశ్రమను 4వేల కోట్లతో పునరుద్ధరించనున్నామని డిప్యూటీ సీఎం విక్రమార్క తెలిపారు.

కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు

ఈ ప్రజా విజయోత్సవాల సందర్బంగా నవంబర్ 14 (November 14th) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తామని, చివరి రోజు డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలు, క్రాకర్స్ ప్రదర్శన తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామని భట్టి చెప్పారు. 26 రోజులలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 4 పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామన్నారు. వివిధ శాఖలకు సంబందించిన పాలసీ విధానాలను ప్రకటిస్తామని, పలు కంపెనీలతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం, స్పోర్ట్ యూనివర్సిటీకి ఫౌండేషన్, 16 నర్సింగ్ కళాశాలలు, 28 పారా మెడికల కళాశాలల ప్రారంభోత్సవం, ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన, తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం

తెలంగాణలో ఏర్పాటు చేసిన రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ను ప్రారంభిస్తామని భట్టి  విక్రమార్క చెప్పారు. పోలీసు శాఖ ద్వారా డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాలు, డాగ్ షోలు, పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version