
LRS in Telangana : రాష్ట్రంలో నాలుగేళ్లుగా పెండింగ్లో ఉన్న లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) ప్రక్రియను 3 నెలల్లో పూర్తి చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరించాలని, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్. ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని చెప్పారు. తమ ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియలో ముఖ్యంగా ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
మొత్తం 25.70 లక్షల దరఖాస్తులు..
శనివారం భూపాలపల్లి పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాస్రెడ్డి అక్కడి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఖమ్మం జిల్లా నుండి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఆగస్టు 31 నుంచి అక్టోబరు 31, 2020 వరకు ఎల్ఆర్ఎస్. దరఖాస్తులను సీకరించింది. ఈ సమయంలో 25.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత నాలుగేళ్లుగా ఈ దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి. మొత్తంగా 25.70 లక్షల దరఖాస్తుల్లో హెచ్ఎండీఏ పరిధిలో 3.58లక్షలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పరిధిలో 13.69 లక్షలు, అలాగే గ్రామ పంచాయతీల్లో 6 లక్షలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటి పరిధిలో 1.35 లక్షల దరఖాస్తులు అందాయి.
LRS in Telangana ఈ దరఖాస్తుదారులు సమస్య పరిష్కారం కోసం నాలుగేళ్ల నుంచి వేచి చూస్తున్నారని మంత్రి తెలిపారు. ఈ దరఖాస్తులను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరించాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. దరఖాస్తుల పరిష్కరానికి జిల్లాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాలని, సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై తీసుకురావాలిన చెప్పారు. ప్రతిపాదనలు పంపిస్తే రెవెన్యూ శాఖ నుంచి సిబ్బందిని సర్దుబాటు చేస్తామని మంత్రి చెప్పారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులతో కూడిన మల్టీ డిసిప్లినరీ బృందాలు ఏర్పాటు చేయాలి.. రెగ్యూలేషన్ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు అన్ని కలెక్టరేట్ లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు (హెల్ప్ డెస్క్ ) ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ ఆథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తులను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని మంత్రి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఎల్అర్ఎస్ దరఖాస్తుల పరిశీలించే అన్ని స్థాయుల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వాలని, ఎల్ఆర్ఎస్ విధివిధానాలను విడుదల చేసిన నేపథ్యంలో అమలుకు అవసరమైన కార్యాచరణను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ లు ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాలల్లో అత్యంత విలువైన భూములు ఉన్నాయని ఈ జిల్లాల్లో లేఅఔట్ ల క్రమబద్దీకరణ విషయములో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..