Kacheguda | రూ.421.66 కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ అభివృద్ధి – చారిత్రక శైలికి నూతన వెలుగు

Kacheguda Railway Station | కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో రూ. 2.23 కోట్ల వ్యయంతో చారిత్రక కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఫసాడ్ ఇల్యూమినేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. సోమవారం ఆయన కాచిగూడ రైల్వేస్టేషన్ ఫసాడ్ ఇల్యూమినేషన్ ప్రారంభించి మాట్లాడారు. నిజాంల పాలనలో 1916 లో “గోతిక్ శైలి”లో నిర్మితమైన కాచిగూడ రైల్వేస్టేషన్ కు ఉన్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, రైల్వేస్టేషన్ ఉన్న అద్భుతమైన నిర్మాణ శైలిని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా మొత్తం 785 ఇల్యూమినేషన్ లైట్లను ఏర్పాటు చేశారన్నారు. నగరం మధ్యలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజూ వేల సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారని కిషన్ రెడ్డి తెలిపారు.
Kacheguda : గ్రీన్ రైల్వే స్టేషన్లలో ప్లాటినం రేటింగ్
గ్రీన్ రైల్వే స్టేషన్లకు రేటింగ్ ఇచ్చే ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్.. కాచిగూడ రైల్వేస్టేషన్కు ప్లాటినం రేటింగ్ ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అంతేకాకుండా, భారతీయ రైల్వేలో ఎనర్జీ ఎఫిషియంట్ స్టేషన్ గా కాచిగూడ రైల్వేస్టేషన్ నిలిచిందని అన్నారు. భారతీయ రైల్వేలో మొట్టమొదటి డిజిటల్ పేమెంట్ సేవలు కూడా కాచిగూడ రైల్వేస్టేషన్ లోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు.
ఇలా ఎన్నో రకాలుగా ప్రాముఖ్యతను సంతరించుకున్న కాచిగూడ రైల్వేస్టేషన్ ను రూ.421.66 కోట్లతో అమృత్ భారత్ రైల్వేస్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు రూ. 2,750 కోట్లతో మొత్తం 40 రైల్వేస్టేషన్లను వచ్చే 30 సంవత్సరాల అవసరాలను తీర్చేలా పునరాభివృద్ధి చేస్తున్నారన్నారు. అందులో పునరాభివృద్ధి పూర్తి చేసుకున్న బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలే ప్రారంభించారన్నారు.
Dedication of Kacheguda Railway station façade lighting to the Nation by Shri G. Kishan Reddy, Hon’ble Minister of Coal and Mines, Govt. Of India #DazzlingKacheguda@RailMinIndia @kishanreddybjp @drmhyb @drmsecunderabad pic.twitter.com/OyM8OMXqUX
— South Central Railway (@SCRailwayIndia) June 9, 2025
నగరంలోని ప్రధాన రైల్వేస్టేషన్ల మీద ఒత్తిడిని తగ్గించటం కోసం రూ.430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వేస్టేషన్ (Cherlapalli Railway Terminal)ను కూడా ప్రధానమంత్రి ఇటీవలే ప్రారంభించారన్నారు. రవాణా వ్యవస్థలో కీలకమైన రైల్వే రంగం కూడా రాష్ట్రంలో గత 11 ఏళ్లలో గణనీయమైన ప్రగతిని సాధించింది. గత 11 ఏళ్లలో.. తెలంగాణలో రోడ్ల నెట్వర్క్ రెట్టింపవగా.. రైల్వేల నెట్వర్క్ మూడింతలు పెరిగిందన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు గత 11 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి రూ. 30,832 కోట్ల బడ్జెట్ ను కేటాయించినట్టు తెలిపారు. ఈ ఏడాది రైల్వే బడ్జెట్లోనూ రూ.5,337 కోట్లు తెలంగాణకు కేటాయించారన్నారు . ఇది 2014-15 నాటి తెలంగాణకు కేటాయించిన రైల్వే బడ్జెట్ తో పోలిస్తే 20 రెట్లు ఎక్కువ. తెలంగాణలో ప్రస్తుతం రూ.42,219 కోట్ల విలువైన రైల్వే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు. 2014కు ముందు తెలంగాణ వ్యాప్తంగా ఏడాదికి 17.4 కిలోమీటర్ల రైల్వేలైన్ల నిర్మాణం జరిగితే.. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏడాదికి 55 కిలోమీటర్ల రైల్ లైన్ల నిర్మాణం జరుగుతోందన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంఎంటీఎస్-ఫేజ్ 2లో భాగంగా పలు ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు. దాదాపు రూ.700 కోట్లతో వరంగల్ (Waragnal) లో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్ ఎంయూ) కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దీని పనులు కూడా చాలా వేగంగా సాగుతున్నాయన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 3వేల మందికి.. పరోక్షంగా మరింత మందికి ఉపాధి లభించనుంది. ఈ పదకొండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 444 కిలోమీటర్ల డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ లైన్ల పనులు తెలంగాణలో పూర్తయ్యాయి. మూడు పెద్ద ప్రాజెక్టులు: సికింద్రాబాద్-మహబూబ్నగర్, రాఘవాపురం-మందమర్రి, ఎంఎంటీఎస్ ఫేజ్-2 చేపట్టడం జరిగిందన్నారు. 2004-14 మధ్యలో తెలంగాణలో 759 కిలోమీటర్ల మేర రైల్వైలైన్ల విద్యుదీకరణ పూర్తయితే.. ఈ 11 ఏళ్లలో 1,890 కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయిందన్నారు. నూతనంగా నిర్మిస్తున్న రైల్వేలైన్లను మినహాయిస్తే తెలంగాణలోని రైల్వే లైన్లన్నీ 100 శాతం ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేసుకున్నాయని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.