
జమ్మూ కశ్మీర్ (Jammu Kashmir) లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట నిర్విరామంగా సాగుతోంది. ఇదిలా ఉంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రస్థావరాలను, పాక్ తరలిస్తోందని పలు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. ఇక పహల్గామ్ నిందితుల్లో ఇప్పటికే ఆ నలుగురి లొకేషన్లను ట్రాక్ చేయగా.. వారు త్రుటిలో తప్పించుకున్నారు. ఒకసారి భద్రతా దళాలు.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు కూడా చోటుచేసుకొన్నాయి.
ముఖ్యంగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఎప్పటికప్పుడు వారి లొకేషన్లను గుర్తిస్తున్నారు. వారు మా కనుచూపు మేరలోకి వచ్చినా.. కాల్పులు జరిపి తప్పించుకొంటున్నారు. ఇక్కడ అడవులు అత్యంత దట్టంగా ఉన్నాయి. మనకు కనిపిస్తున్నా.. ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. వారిని పట్టుకొని తీరతాం. కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందని ఓ సైనిక అధికారి తెలిపారు. ఉగ్రవాదులను తొలుత అనంతనాగ్లోని పహల్గాం తెహస్లీ వద్ద గుర్తించారు. కానీ, దళాలు అక్కడికి చేరేలోపు వారు దట్టమైన కీకారణ్యంలోకి పారిపోయారు. ఆ తర్వాత కుల్గాం అడవుల్లో వారి కదలికలు కనిపించాయి. అక్కడికి చేరుకొన్న భద్రతా దళాలపై కాల్పులు జరిపి పారిపోయారు. అనంతరం తిరిగి త్రాల్ కొండల్లో వారు ఉన్నట్లు దళాలు గుర్తించాయి. అక్కడి నుంచి వారు జారుకొన్నాక కొకెర్నాగ్లో లొకేషన్ బయటపడింది. వారు ప్రస్తుతం ఈ ప్రాంతం చుట్టుపక్కలే ఉండ వచ్చని చెబుతున్నారు. ఒక గ్రామంలోని ఇంట్లో వారు రాత్రి భోజనానికి వెళ్లగా అక్కడికి దళాలు చేరుకోవడంతో.. ఆహారం తీసుకొని వారు పారిపోయినట్లు సైనికాధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఉగ్రవాదులు తమకు అవసరమైన నిత్యావసరాల సేకరణలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. సాధారణంగా వీరు గ్రామాల సపంలోకి వెళ్లినప్పుడు అక్కడ ఉండే స్థానిక సహాయకులను సంప్రదించి అడవుల్లోకి ఆహారం తెప్పించుకుంటారు. ఆ సమయంలో దళాలకు హ్యూమన్ ఇంటెలిజెన్స్ లభిస్తుంది. కానీ వీరు చాలా అప్రమత్తంగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
భారత భద్రతా సంస్థలు క్రియాశీలకంగా ఉన్న పలు లాంచ్ప్యాడ్లను గుర్తించిన నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పీఓకేలోని కెల్, సర్ది, దుధ్నియల్, అత్ముఖం, జురా, లిపా, పచ్చిబన్, ఫార్వర్డ్ కహుతా, కొట్లి వంటి పలు ప్రాంతాల నుంచి ఉగ్రవాదులను తరలిస్తున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్లోకి చొరబడటానికి ముందు వారు నివసించే కీలక కేంద్రాలుగా ఈ లాంచ్ప్యాడ్స్ పనిచేస్తాయి. వీటిలో 150 నుంచి 200 మంది శిక్షణ పొందిన ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా చొరబాటుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నాయి. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో భారత్, పాక్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచివెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.