Wednesday, March 5Thank you for visiting

సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసా..

Spread the love

పురాతన కాలం నుంచి హనుమాన్ చాలీసా హిందూ సంస్కృతిలో ఓ భాగమైంది. ఆంజనేయస్వామిని ఆరాధించే వారు ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా పారాయణం చేస్తారు. హనుమాన్ చాలీసా 40 శ్లోకాలను కలిగి ఉంటుంది. అయితే భక్తుడు కేవలం ఒక్క సెంటీమీటర్ ఉన్న పుస్తకంలో హనుమాన్ చాలీసా రాశాడు. హరియాణాలోని హిస్సార్ కు చెందిన జితేంద్ర పాల్ సింగ్ ఒక సెంటీమీటర్ పుస్తకంలో హనుమాన్ చాలీసాను రాశాడు.

జితేంద్రపాల్ సింగ్ అత్యంత సూక్ష్మమైన 15 పేజీల పుస్తకాన్ని రూపొందించారు. ప్రతీ పేజీ ఒక సెంటీమీటర్ పొడవు, అర సెంటీమీటర్ వెడల్పు ఉంటుంది. అంతేకాదు ఈ పుస్తకం కవర్ పేజీపై పర్వతాన్ని ఎత్తుకొని వెళ్తున్న హనుమంతుడి చిత్రపటాన్ని కూడా చిత్రీకరించాడు. ఈ పుస్తకాన్ని దెబ్బతినకుండా రక్షించడానికి లామినేట్ కూడా చేశాడు.

ఈ హనుమాన్ చాలీసా మినియేచర్ వెర్షన్ రాయడానికి తనకు 15 రోజులు పట్టిందని జితేంద్ర పాల్ సింగ్ వివరించారు. ఈ పుస్తకాన్ని ప్రజలు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లి చదువుకోవచ్చని తెలిపారు. జితేంద్రపాల్ సింగ్ వృత్తి రీత్యా ప్రైవేట్ స్కూల్ లో డ్రాయింగ్ మాస్టర్. హనుమాన్ చాలీసాతో పాటు ఈయన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం పొందిన ఇతర అనేక సూక్ష్మ కళాఖండాలను కూడా సృష్టించాడు. అతడి ప్రతిభకు వివిధ ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల నుంచి ఎన్నో ప్రశంసలు, అవార్డులు లభించాయి.

ఎన్నో సూక్ష్మ కళాఖండాలు

బియ్యం గింజలపై 118 దేశాల జెండాలు, శనగపప్పు గింజలపై పది మంది సిక్కు గురువుల చిత్రపటాల వంటి 70 రకాల ఇతర సూక్ష్మ కళాఖండాలను జితేంద్ర పాల్ సింగ్ గతంలో రూపొందించారు. మొత్తంగా అతడి పేరు మీద సుమారు 35 రికార్డులు ఉన్నాయి. అప్పటి గవర్నర్ ధానిక్ లాల్ మండల్, గవర్నర్ మహావీర్ ప్రసాద్ తదితరుల నుంచి ప్రశంసలు పొందారు.
హిందువుల హృదయాల్లో హనుమాన్ చాలీసాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతత, శ్రేయస్సు లభిస్తుందని ఆందోళన, భయాన్ని దూరం చేస్తుందని, బాధలను అధిగమించడంలో సాయపడుతుందని అందరూ నమ్ముతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version