
Double Bedroom House : హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలు, మూసీ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించుకొని జీవిస్తున్న నిరు పేదలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లు లేదా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అర్హులైన పేదలను రోడ్డున పడే పరిస్థితులను తీసుకురావొద్దని సూచించారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ లో ఆక్రమిత చెరువులు, నాలాలతోపాటు మూసీ పరీవాహక ప్రాంతంలో నివసించే పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదలకు భరోసా కల్పించే విధంగా తప్పకుండా ప్రయత్నం చూడాలని సూచించారు. పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తలెత్తవద్దని, వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులకు సూచించించారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటల పరిరక్షణను ప్రణాళికాబ్దంగా చేపడుతున్నామని, సీఎం చెప్పారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని చెరువులు, కుంటలు, నాలాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై చెరువులు, నాలాలు కబ్జాకు గురి కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని సీఎం ఆదేశించారు. దీనిలో భాగంగా నగరంలో ఉన్న అన్ని చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని సీఎం అధికారులకు చెప్పారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలు, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రతీ చెరువు నాలాల ఆక్రమణల వివరాలు సేకరించాలన్నారు. వీటికి సంబంధించిన పూర్తిస్థాయి నివేదికను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో అర్హులైన పేదలకు ఎలాంటి నష్టం రాకుండా ప్రభుత్వం చేపట్టే చర్యలు ఉండాలని అప్రమత్తం చేశారు
ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ
ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికను రూపొందించాలని, ఓల్డ్ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. మెట్రో మార్గాలకు సంబంధించిన భూసేకరణ, ఇతర అడ్డంకు లు ఉంటే అధికారులు వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలన్నారు. దసరాలోపు మెట్రో విస్తరణ రూట్పై పూర్తిస్థాయి డీపీఆర్ను రూపొందించి కేంద్రానికి సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు.
జూబ్లీహిల్స్ లో తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్, హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, సలహాదారు శ్రీనివాసరాజు, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, హెచ్ఎండీఎ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..