Thursday, June 19Thank you for visiting

Hajj | హజ్ యాత్రలో 98 మంది భారతీయ యాత్రికుల మృతి

Spread the love

Mecca | ఈ ఏడాది హజ్ (Hajj ) యాత్ర సందర్భంగా సౌదీ అరేబియాలో 98 మంది భారతీయ యాత్రికులు మరణించారని ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. అనారోగ్యం, వృద్ధాప్య కారణాల వల్ల ఎక్కువ మరణాలు సంభవించినట్లు పేర్కొంది.

“ప్రతి సంవత్సరం, చాలా మంది భారతీయ యాత్రికులు హజ్‌ను సందర్శిస్తారు. ఈ సంవత్సరం, ఇప్పటివరకు 1,75,000 మంది భారతీయ యాత్రికులు హజ్ కోసం సౌదీని సందర్శించారు. కోర్ హజ్ కాలం జూలై 9 నుంచి 22 వరకు ఉంది. ఇప్పటివరకు 98 మంది భారతీయ యాత్రికులు మరణించారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా గతేడాది మరణాల సంఖ్య 187గా నమోదైంది.

సౌదీ అరేబియాలోని మక్కాలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఈ ఏడాది హజ్ యాత్రలో 1,000 మంది యాత్రికులు (Hajj pilgrims ) మరణించారని AFP నివేదించింది. అరబ్ దౌత్యవేత్త ప్రకారం.. ఈజిప్టు నుంచి 658 మంది యాత్రికులు మరణించారు. వీరిలో 630 మంది నమోదు కాని యాత్రికులు ఉన్నారు. జోర్డాన్, ఇండోనేషియా, ఇరాన్, సెనెగల్, ట్యునీషియా కూడా యాత్రికులు మరణించినట్లు తెలుస్తోంది.

మరోవైపు అనేక మంది యాత్రికులు తప్పిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లు తప్పిపోయిన వారి చిత్రాలు, సమాచారం కోసం పోస్టులతో నిండిపోతున్నాయి.

అత్యధిక ఉష్ణోగ్రతలు..

హజ్ తీర్థయాత్ర ఇస్లాం కు సంబంధించి ఐదు స్తంభాలలో ఒకటి, ముస్లింలు తమ జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని భావిస్తుంటారు. అయితే ఈ సంవత్సరం తీర్థయాత్రలో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌ను దాటడంతో యాత్రికులు విలవిలలాడిపోతున్నారు. ఇటీవలి దశాబ్దాలలో ఇదే అత్యధికం. తీర్థయాత్ర ప్రాంతంలో దశాబ్దానికి 0.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 2023లో, హజ్ సమయంలో 200 మందికి పైగా యాత్రికులు మరణించారు.


 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version