Wednesday, April 16Welcome to Vandebhaarath

Sankranti 2025 | సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు

Spread the love

2025 Sankranti Special Buses | సంక్రాంతి పండుగ వ‌చ్చిందంటే చాలు హైద‌రాబాద్ (Hyderabad)మొత్తం నిర్మానుష్యంగా మారిపోతుంది. పండుగ సెలవుల‌ను ఎంజాయ్ చేయ‌డానికి న‌గ‌ర‌వాసులు త‌మ సొంతూళ్ల‌కు ప‌య‌న‌మ‌వుతారు. ముఖ్యంగా న‌గ‌రంలో చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలు సంక్రాంతి సంద‌ర్భంగా ఆంధ్రాకు పెద్ద ఎత్తున ప్ర‌యాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బ‌స్టాండ్లు, రైల్వేస్టేష‌న్లు ప్ర‌యాణికుల‌తో కిక్కిరిసిపోతుంటాయి. ఆర్టీసీ బ‌స్సులు, రైళ్లలో క‌నీసం నిల‌బ‌డేందుకు కూడా స్థ‌లం ఉండ‌దు.. ప్ర‌యాణికుల ర‌ద్దీ నేప‌థ్యంలో ప్ర‌యాణికుల‌కు టిజిఆర్టీసీ (TGSRTC) తీపిక‌బురు చెప్పింది.

557 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం

సొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముంద‌స్తుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ ‌నుంచి తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌(Andhra Pradesh)కు కూడా ప్రత్యేక బస్సులను నడ‌పాల‌ని నిర్ణ‌యించింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6,432 ప్రత్యేక బస్సులను నడప‌నుంది. అందులో 557 బ‌స్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌక‌ర్యం క‌ల్పించింది. గత సంవ‌త్స‌రం సంక్రాంతి పండుగ‌కు 4,484 ప్రత్యేక బస్సులు నడిపించింది. అయితే ప్రయాణికుల రద్దీకి అవేమాత్రం స‌రిపోలేదు. ఆ త‌ర్వాత‌ 5,246 బస్సులకు పెంచింది. గ‌త ఏడాది అనుభవాలను దృష్టిలోపెట్టుకొని ఈసారి 6,432 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. 2025 జనవరి 9 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండ‌నున్నాయి. హైదరాబాద్‌లో ప్ర‌యాణికులు ర‌ద్దీగా ఉండే ఎంజీబీఎస్‌, ‌జేబీఎస్‌, ఉప్పల్‌ ‌క్రాస్‌ ‌రోడ్స్, ఆరాంఘర్‌, ఎల్‌బీనగర్‌ ‌క్రాస్‌ ‌రోడ్స్, ‌కేపీహెచ్‌బీ, గచ్చిబౌలి, బోయిన్‌పల్లి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు న‌డుస్తాయి. ఆయా ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్ర‌త్యేక బ‌స్సులతోపాటు ప్రత్యేక అధికారులను సైతం టిజి ఆర్టీసీ నియమించింది.

ఏయే నగరాలకు..?

ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, విజయవాడ, శ్రీశైలం, అమలాపురం, రాజమహేంద్రవరం, నర్సాపురం, కందుకూరు, పోలవరం, రాజోలు, ఉదయగిరి, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయి. తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్‌ ‌నుంచి తిరుగు పయనమయ్యే వారి కోసం కూడా ప్రత్యేక బస్సులను న‌డిపించ‌నుంది. ఈ సంక్రాంతి పండుగ‌కు వరంగల్‌, ‌కరీంనగర్‌, ‌నిజామాబాద్‌ ‌నుంచి ఎలక్ట్రి ‌బస్సులను అందుబాటులో ఉంచేలా ప్రణాళిక‌లు రూపొందిస్తోంది.

మహిళలు టికెట్లు తీసుకోవాల్సిందే..

మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ‌ప్రెస్‌, ‌సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ‌ప్రెస్‌ ‌బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌక‌ర్యం అమ‌లులో ఉంద‌ని టీజీఎస్ ఆర్ట‌సీ తెలిపింది. ప్రయాణ సమయంలో మహిళలు జీరో టికెట్లను తీసుకోవాలని సూచించింది. ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను చేసుకోవాలని పేర్కొంది. ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్‌ ‌సెంటర్‌ 040-69440000, 040-23450033 ‌నంబర్లకు సంప్రదించాలని అధికారులు సూచించారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version